సంచలనం:స్నేహితుడి భార్యపై వైసిపి నేత అత్యాచార యత్నం, అరెస్ట్
గుంటూరు : దాచేపల్లి మైనర్ బాలిక అత్యాచార ఘటనతో అట్టుడికి పోతున్న గుంటూరు జిల్లాలో తాజాగా మరో ఉదంతం సంచలనం సృష్టించింది. స్నేహితుడి భార్య పైనే వైసిపి నేత లైంగిక వేధింపులకు పాల్పడిన ఉదంతం వెలుగు చూడటం కలకలం రేపింది.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడైన వైసిపి నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. దాచేపల్లి మైనర్ బాలిక అత్యాచారం ఘటన నేపథ్యంలో టిడిపి పాలనలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయని వైకాపా నేతలు తీవ్ర ఆరోపణలు గుప్తిస్తున్న నేపథ్యంలోనే వైసిపి నేత ఈ తరహా అఘాయిత్యానికి పాల్పడి అరెస్ట్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే...
గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు, మాచర్ల మాజీ ఎంపీపీ రమావత్ నర్సింగ్ నాయక్ స్వస్థలం అచ్చమ్మకుంట తండా. మాచర్ల ఎంపీపీగా పనిచేసిన రమావత్ నర్సింగ్ కు తన స్వగ్రామమైన అచ్చమ్మకుంట తండాలో ఒక స్నేహితుడు ఉన్నాడు. తమ ఇద్దరి మద్య ఉన్న స్నేహ సంబంధాల నేపథ్యంలో నర్సింగ్ నాయక్ వారి ఇంటికి రాకపోకలు సాగిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో తన భర్త స్నేహితుడైన రమావత్ నర్సింగ్ నాయక్ తో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్నేహితుడి భార్య అతడితో కలసి వెళ్లింది.
ఈ క్రమంలో హోటల్ లో భోజనం చేద్దామని చెప్పి రమావత్ నర్సింగ్ నాయక్ ఆమెను ఒక లాడ్జికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించి తప్పించుకొని ఇంటికి చేరింది. ఆ తరువాత జరిగిన విషయాన్న ఇంట్లో వారికి చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమావత్ నర్సింగ్ నాయక్ ను అరెస్ట్ చేశారు.