ఏపీ ఎమ్మెల్యే కొడుకుపై రేప్ కేసు.. గిరిజన యువతిపై..
కాకినాడ : మొన్నటికి మొన్న ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు సుశీల్.. నడిరోడ్డుపై ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి వివాదంలో ఇరుక్కోగా.. తాజాగా మరో ఎమ్మెల్యే తనయుడిపై అత్యాచార ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.
తనను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తూ.. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పరుపుల సుబ్బారావు తనయుడు రాజాబాబుపై ఓ గిరిజన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. పెళ్లి పేరుతో తనను మోసగించాడని పేర్కొంటూ రాజాబాబుపై సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది గిరిజన యువతి.
యువతి ఫిర్యాదుతో రాజాబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు అత్యాచార కేసు నమోదు చేశారు పోలీసులు. వీటితో పాటు క్రైమ్ నంబర్ 323/16 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అనంతరం యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎట్టి పరిస్థితుల్లోను తమకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తోన్న బాధిత యువతి బంధువులు.. రాజాబాబును కేసు నుంచి తప్పించేందుకు తెరవెనుక కొంతమంది పావులు కదుపుతున్నారని ఆరోపిస్తున్నారు.