ఏపీ ఎఫెక్ట్: 'యూపీలో బిజెపికి తెలుగోడి దెబ్బ', 'రాజకీయాల్లో వేగంగా మార్పులు'
హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో వేగంగా పరిణామాలు మారుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ఇంకా మార్పులు చోటు చేసుకొనే అవకాశాలున్నాయని పార్టీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
ఉత్తర్ప్రదేశ్, బీహర్ రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం నాడు విశ్లేషించారు. టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు అమరావతిలో టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
యూపీలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలైంది.సమాజ్వాదీ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించారు. బీహర్లో ఒక్క స్థానంలో బిజెపి విజయం సాధించగా మరో స్థానంలో ఆర్జేడీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
జాతీయ రాజకీయాల్లో వేగంగా మార్పులు
జాతీయ రాజకీయాల్లో వేగంగా మార్పులు సంభవిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. యూపీ, బీహర్ రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలపై చంద్రబాబునాయుడు విశ్లేషించారు. ఈ ఉప ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలను బాబు విశ్లేషిస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జాతీయ రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయన్నారు. వేగంగా మార్పులు చోటు చేసుకొంటున్నాయని చెప్పారు.
ప్రజలే ప్రతిపక్షంగా భావించాలి
ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకున్నా ప్రజలనే ప్రతిపక్షంగా భావించి పనిచేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్ర అసెంబ్లీకి వైసీపీ దూరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడ తమ లోటు పాట్లను బేరీజు వేసుకోవాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. ప్రత్యర్ధుల బలాలు, బలహీనతలను అధ్యయనం చేయాలని సూచించారు.
బిజెపికి ఏపీ దెబ్బ తగిలింది
ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా బిజెపి చేసిన అన్యాయంపై యూపీ ప్రజలు గట్టిగా బుద్దిచెప్పారని టిడిపి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అభిప్రాయపడ్డారు. ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయని బిజెపికి గోరఖ్పూర్లో ఉన్న తెలుగు ప్రజలు తగిన సమాధానం చెప్పారన్నారు.గోరఖ్పూర్ నియోజకవర్గంలో ఎక్కువగా ఏపీ రాష్ట్రానికి చెందినవారే ఉన్నారని ఆంజనేయులు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారు గోరఖ్పూర్లో నివాసం ఉంటున్నారని ఆయన చెప్పారు. బిజెపిని తెలుగు ప్రజలు ఓడించారన్నారు.
బిజెపి ఓటమికి గుణపాఠం
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి ఓటమి పాలు కావడం ఆ పార్టీకి గుణపాఠమని టిడిపి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. యూపీ ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గంలోనే బిజెపి ఓటమిపాలైన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తించాలని బండారు చెప్పారు. ఎవరినీ మోసం చేసినా మోసం మోసమేనని బండారు సత్యనారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్రంతో అవసరం లేదనే రీతిలో బిజెపి నేతలు వ్యవహరించారని ఆయన విమర్శించారు.ఈ ఫలితాలు బిజెపిలో కనువిప్పును తీసుకురావాల్సిన అవసరం ఉందని బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. ఇప్పటికైనా బిజెపి నాయకత్వం మేల్కొని ఏపీ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఇవ్వాలని ఆయన కోరారు.