ఏపీలో 10 నిముషాల్లోనే కరోనా టెస్టుల ఫలితాలు: దక్షిణ కొరియా నుండి ర్యాపిడ్ కిట్లు
కరోనా పరీక్షల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో త్వరితగతిన కరోనా బాధితులను గుర్తించటానికి కావాల్సిన ర్యాపిడ్ కిట్లను ఏపీ సిద్ధం చేసుకుంది . వేగవంతంగా కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్కు లక్ష కరోనా ర్యాపిడ్ కిట్లను కొనుగోలు చేసిన ఏపీ సర్కార్ దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక చార్టర్ విమానంలో ఈ కిట్లను ఏపీకి తీసుకొచ్చింది .
ర్యాపిడ్ కిట్ల ద్వారా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితాలు
ఏపీలో ఇప్పటివరకు 572 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లేసులు పెరుగుతున్న నేపధ్యంలో నియంత్రణకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు .శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా వైరస్ ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాపిడ్ కిట్ల ద్వారా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితాన్ని గుర్తించవచ్చు అంటున్నారు .
కమ్యూనిటీ టెస్టింగ్ కోసం ర్యాపిడ్ కిట్ల వినియోగం
ఇప్పటికే గ్రామ గ్రామాన వాలంటీర్ల తో సర్వే నిర్వహిస్తున్న ఏపీ సర్కార్ కొత్తగా లక్ష ర్యాపిట్ కిట్లు రావడంతో కరోనా పరీక్షలు మరింత ముమ్మరం చెయ్యనుంది . నాలుగైదు రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ కిట్లను పంపించనున్నట్టు చెప్పారు. ఇక ఇప్పటికే ప్రతి రోజు నాలుగు వేల వరకు కరోనా టెస్టింగ్ సామర్ధ్యం పెంచుతామని చెప్పిన అధికారులు కమ్యూనిటీ టెస్టింగ్ కోసం ఈ ర్యాపిడ్ కిట్లను వినియోగిస్తామని తెలిపారు. మరోవైపు కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
దేశంలో కరోనా పరీక్షల నిర్వహణలో టాప్ 5 లో ఏపీ
ఇక ఈ కిట్స్ ద్వారా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది నిర్ధారించడమే కాకుండా, ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గినా సరే ఈ కిట్లు గుర్తిస్తాయి. కరోనా ప్రభావం ఏ మాత్రం ఉన్నా ఈ కిట్ల ద్వారా తెలుసుకోనున్నారు .కరోనా పరీక్షలు నిర్వహణలో ఏపీ దేశంలో టాప్-5లో ఉందని ఏపీ సర్కార్ చెప్తున్న పరిస్థితి . ఇక వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్.జవహర్రెడ్డి కర్నా కంట్రోల్ కోసం ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నం చేస్తుందని చెప్పారు . దేశంలో మిలియన్ జనాభాకు సగటున 198 పరీక్షలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో 331 మందికి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు .
కరోనా నియంత్రణకు ఏపీ వ్యూహాలు
ప్రధానంగా క్లస్టర్ కంటైన్మెంట్, మెరుగైన వైద్యం ద్విముఖ వ్యూహం అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి టెస్టులు చేస్తేనే ఇన్ఫెక్షన్ రేటు తెలుస్తుందని, అందుకే ఎక్కువ మందికి పరీక్షలు చేసి వైరస్ను నియంత్రించేందుకు ముందుకు వెళుతున్నట్టు పేర్కొన్నారు. ఏపీ సర్కార్ కరోనా నియంత్రణకు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తుంది . టెక్నాలజీని వాడుకుంటుంది. మానవ వనరుల వినియోగంలోనూ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ముందు వరసలోనే ఉంది .