అనగనగా ఒక చేప: లక్షాధికారైన మత్స్యకారుడు.. ఏంటా చేప..ఏమా కథ..?
చీరాల: ఈ సీజన్లో అతిథులు ఎవరైనా ఇంటికి వస్తే కచ్చితంగా వారికి చేపల కూర భోజనంలో వడ్డిస్తాం. ఎందుకంటే ప్రస్తుతం ఇది చేపల సీజన్ కాబట్టి. అదే అతిథులకు పులస చేప కూర వండి పెడితే.. లొట్టలేసుకుని లాగించేస్తారు. పులస చేప తినాలంటే అదృష్టం ఉండాలంటారు. ఎందుకంటే అది చాలా అరుదుగా దొరుకుతుంది. పైగా ఖరీదెక్కువ. అందుకే అంటారు పులస కోసం పుస్తెలయినా సరే తాకట్టు పెట్టొచ్చని. పులస చేప ఎవ్వారం కాస్త పక్కన బెడితే..ప్రకాశం జిల్లా చీరాల వాడరేవులో ఓ భారీ చేప మత్స్యకారుల వలకు చిక్కింది. పులసలా ఇది కూడా చాలా అరుదుగా మత్స్యకారులకు చిక్కుతుంది. దీనిపేరు కచిడి చేప. దీని ధర గురించి విన్నారంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంతకీ ఈ చేప స్పెషాలిటీ ఏంటి ఓ సారి లుక్కేద్దాం.
కచిడి చేప దొరకడంతో...
గోదావరి నదిలో దొరికే పులస చేపకు డిమాండ్ ఎంత ఉంటుంది..? మహా అయితే వేలల్లో ఉంటుంది. కానీ సముద్రంలో దొరికే కచిడి అనే ఈ చేపకు మాత్రం ధర లక్షల్లో పలుకుతుంది. ఎందుకంటే ఈ చేపలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సముద్రంలో చాలా అరుదుగా కనిపించే ఈ చేప ప్రస్తుతం ప్రకాశం జిల్లా చీరాల వాడరేవులో ప్రత్యక్షమైంది. ఓ మత్స్యకారుడి వలకు చిక్కుకుంది. దీని బరువు 28 కిలోలు. సాధారణంగా కచిడి చేపలు 30 కిలోల కంటె ఎక్కువగా కూడా తూగుతాయి. మొత్తానికి ఈ కచిడి చేప దొరకడంతో మత్స్యకారుడు లక్షాధికారయ్యాడు.
రూ.1.70 లక్షలు ధర పలికిన కచిడి చేప
ముందుగా ఈ కచ్చిడి చేపను కొనుగోలు చేసేందుకు చాలా మంది పోటీపడ్డారు. అయితే చివరకు అదే గ్రామానికి చెందిన వ్యాపారి రూ.1.70లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఈ చేపకు ఎందుకు ఇంత డిమాండ్.. ఇందులో ఏముందనే కదా మీ డౌటు..? అక్కడికే వస్తున్నాం. సాధారణంగా కచిడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్గా పిలుస్తారు. నిజంగానే ఈ చేప దొరికితే మత్స్యకారులు తమకు బంగారం దొరికనట్టే భావిస్తారు. తమకు సిరులు కురిపిస్తుందని చెబుతుంటారు.ఈ చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదు. ఒక చోట నుంచి మరో చోటికి ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటుంది. అలా తన ప్రయాణంలో భాగంగా కిచిడి చేప ప్రకాశం జిల్లా చీరాలలోని వాడరేవు ప్రాంతానికి చేరుకోగా ఓ మత్స్యకారుడి వలకు చిక్కింది. సముద్రంలో తన ప్రయాణాన్ని ముగించింది.
Recommended Video
కచిడి చేపలో ఔషధ గుణాలు
ఇక ఈ కచిడి చేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్తో తయారు చేస్తారట. ఇక కాస్లీ వైన్స్లో కూడా ఈ చేపను వేయడంతో ఆ వైన్ ధర కూడా ధర ఎక్కువగా పలుకుతుందని ఈ చేప గురించి పూర్తిగా తెలిసిన వారు చెబుతున్నారు. కచిడి చేపల పొట్టభాగం ఒక్కటే రూ.80వేల వరకు ధర పలుకుతుందట. పొట్టభాగాన్ని బలానికి వాడే మందుల్లో వినియోగిస్తారట. మగ కచిడి చేపలు బంగారు వర్ణంలో ఉండటంతో వీటిని బంగారు చేపలని కూడా పిలుస్తారు.ఈ చేప కోసం గంగపుత్రులు తెగ ప్రయత్నాలు చేస్తుంటారట. ఎవరికైతే ఇది దొరుకుతుందో వారి బతుకు చిత్రమే మారిపోతుందని చెబుతున్నారు. అందుకే ఈ చేప ఎంతో ప్రత్యేకత అని చెబుతున్నారు. గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఓ మత్స్యకారుడికి ఈ చేప దొరికింది. దాని బరువు 30 కేజీలు. ఓ వ్యాపారి దాన్ని రెండు లక్షల రూపాయలు పోసి కొనుగోలు చేయడంతో జిల్లాలో హాట్టాపిక్గా ఈ వార్త నిలిచింది.