గుంటూరు జిల్లాలో జగన్...పవన్:ఒకేరోజు...ఒకేసారి...విశేషమే!
Recommended Video
గుంటూరు జిల్లాలో ఒకే రోజు రాజకీయంగా అరుదైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్షనేత జగన్ పాదయాత్ర ఇప్పటికే గుంటూరు జిల్లాలో మూడు రోజులుగా కొనసాగుతుండగా మరోవైపు తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుక కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడే మకాం వేశారు.
ఇలా రెండు ప్రధాన పార్టీల అధినేతలు ఒకే సమయంలో జిలాలో తటస్థపడటం ఒక విశేషమైతే...అటు నాగార్జునా యూనివర్శిటీ వద్ద పవన్ సదస్సు...ఇటు పొన్నూరులో జగన్ బహిరంగ సభ ఒకే సమయంలో జరగనుండటం మరో విశేషం.
గుంటూరు జిల్లాకు...పొలిటికల్ ఫీవర్
ఈ పరిణామాలతో సార్వత్రిక ఎన్నికలకు ఇంకో ఏడాది ఉండగానే గుంటూరు జిల్లాను ఒక్కసారిగా పొలిటికల్ ఫీవర్ ఆవహించినట్లయింది. మరోవైపు ఇప్పటికే వైసిపి అధినేత జగన్, జనసేనాని పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్దం తారాస్థాయిలో జరుగుతున్న సమయంలోనే ఇరువురూ ఒకేసారి గుంటూరు జిల్లాలో తటస్థ పడటం ఆసక్తికరంగా మారింది.
జనసేన జోరు...అభిమానుల హోరు...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్కసారిగా ఆవిర్భావ దినోత్సవం ప్రకటనలతో పార్టీ జోరు పెంచేశారు. ఇక ముందు గుంటూరు జిల్లానే తన కేరాఫ్ అడ్రస్ అంటూ పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితమే కాజా గ్రామంలో సొంత ఇంటికి శంకుస్థాపన చేయడం జనసేన్ కు మరింత జోష్ నిచ్చింది. దీంతో నవ్యాంధ్ర రాజధానిలో స్థిర నివాసం ఏర్పరుచుకోబోతున్ననిర్మించుకోబోతోన్నతొలి రాజకీయపార్టీ నాయకుడిగా పవన్ కు క్రెడిట్ దక్కనుంది. ఇక పార్టీ ఆవిర్భావ దినం పురస్కరించుకొని మార్చి 14న ఏఎన్యూ ఎదుట జరిగే భారీ ప్లీనరీ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనే విషయమై అత్యంత ఆసక్తికరంగా మారింది.
నేటితో పాదయాత్ర@1500 కిమీ...జిల్లాలోనే...
ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర సోమవారం బాపట్ల నియోజకవర్గంలో అడుగుపెట్టడం ద్వారా గుంటూరు జిల్లాలో ప్రవేశించింది. జగన్ సుమారుగా 20 రోజుల టు ఇదే జిల్లాలో పర్యటన కొనసాగించే అవకాశం ఉన్నది. బుధవారం పొన్నూరు మండల పరిధిలోని ములుకుదురు గ్రామానికి జగన్ చేరుకునే సమాయానికి ఆయన పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తయినట్లు వైసిపి పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ములుకుదురులో 1500 కిలోమీటర్ల పాదయాత్ర పైలాన్, కేక్ను జగన్ కట్ చేశారు.
మరోవైపు టిడిపి...ఆసక్తిగా గమనిస్తోంది...
రాజకీయ చైతన్యమున్న జిల్లాగా గుర్తింపు పొందిన గుంటూరు జిల్లాలో వైసిపి, జన సేన పార్టీల హడావుడి టిడిపి నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు. టిడిపి ప్రాబల్యం ఉన్న జిల్లాలో ఒకటైన ఈ జిల్లాల్లో ఈ రెండు పార్టీల పోకడలను టిడిపి నిశితంగా గమనిస్తోన్నట్లు సమాచారం. ఈ రెండు పార్టీల అధినేతలు జిల్లాలోనే మకాం వేసిన తరుణంలో జన నాడి ఎలా ఉందనే విషయమై అంచనా వేసేందుకు ఆ పార్టీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. అలాగే ఈ నేపథ్యంలోనే టిడిపి అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకుని రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు శాసనసభ వేదికగా బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఎంపీలు పార్లమెంట్లో పోరాటం కొనసాగిస్తున్నారు. అధికారంలో ఉన్న టీడీపీ కూడా ఎన్నికలకు మరో ఏడాది ఉండటంతో ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు. అందుకే గుంటూరు జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి సిఎం ప్రత్యేకంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం.