విశాఖ జాలరుల వలలో... అరుదైన స్టింగ్ రే, తిమిరి చేపలు... తస్మాత్ జాగ్రత్త...
విశాఖపట్టణం: విశాఖ పట్టణం సాగర్నగర్ సమీపంలో శనివారం జాలర్ల వలకు అరుదైన స్టింగ్ రే, తిమిరి చేపలు చిక్కాయి. తెలుగులో టేకు చేప, తిమిరి చేపలుగా వ్యవహరించే ఈ స్టింగ్ రే ఒక్కొక్కటి దాదాపు 70 కేజీల బరువు తూగగా...తిమిరి చేప 25 కేజీల బరువుందట.
టేకు చేప వెనుక భాగంలో తోకకు ఉండే ముళ్లు చాలా ప్రమాదకరమైనవి. సముద్రంలో చిన్న చేపలను తింటూ జీవనం సాగించే ఇవి ఒక్కొక్కటి దాదాపు 150 కేజీల వరకు బరువు పెరుగుతాయి. వీటిపై ఏవైనా పెద్ద సముద్ర జీవరాశులు దాడికి ప్రయత్నించే సందర్భాల్లో ఏనుగు తొండం మాదిరిగా తోకసాయంతో ప్రతిఘటించి ఎదురుదాడికి దిగి తమను తాము రక్షించుకుంటాయి.
సాధు జీవే..కాని...ప్రమాదమే
సాధారణంగా మానవుల పట్ల సాధు స్వభావంతో స్నేహపూర్వకంగానే మెలిగే ఈ టేకు చేపను భయపడిన స్థితిలోనే తోకతో దాడి చేస్తుంది. చేపల వేట నిర్వహిస్తున్న క్రమంలో మత్స్యకారులు కూడా దీని తోక విషయంలో అత్యంత అప్రమప్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
దాడికి గురైతే...చికిత్స తప్పనిసరి...
పొరపాటున వీటి దాడికి గురైన పక్షంలో తక్షణమే వైద్యం చేయించుకోవాలి. లేనిపక్షంలో ప్రాణానికే ముప్పు వాటిల్లుతుందనడంలో సందేహం లేదని మత్స్యశాఖాధికారులే హెచ్చరిస్తుంటారు.
ఇదీ డేంజరే...షాక్ కొడుతుంది...
టేకు చేపతో పాటు సాగర్ నగర్ మత్స్యకారుల వలకు అరుదైన తిమిరి చేప కూడా చిక్కింది. నల్లరంగుపై తెల్లటి చుక్కలతో కనిపించే ఈ చేప ఎప్పుడో కాని వలలో పడదని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ సముద్ర జీవి ఒక్కొక్కటి సుమారు దాదాపు 25 కేజీలకు పైగా బరువు పెరుగుతుంది.
కరెంట్ వాడేది ఎందుకంటే...ప్రాణరక్షణకే...
భీమిలి ప్రాంతీయ మత్స్యశాఖాధికారి డాక్టర్ పిట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ...ఇది 8 నుంచి 220 వోల్టుల విద్యుత్తును కలిగి ఉంటుందన్నారు. ఈ చేపను పట్టుకుంటే విద్యుత్తు షాక్ కొడుతుందన్నారు. తనకు హానిచేసే చేపలు, జలచరాల నుంచి రక్షించుకోవడానికి ఈ చేప విద్యుత్తును వాడుతుందన్నారు.సముద్రం లోపల మనుగడ సాగించే వీటిపై ఏదైనా పెద్ద సముద్రజీవులు దాడికి యత్నిస్తే చర్మం సాయంతో ఎదురుదాడికి దిగి విద్యుత్తు తరహాలో షాక్ కలిగించి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటాయి.