వడపప్పు తిని, పానకం తాగి వినాయక మండపంలో ఎలుక డ్యాన్స్
గుంటూరు: గుంటూరు జిల్లా కాకమానులోని వీరలకమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. వినాయకుడి వాహనం ఎలుక అనే విషయం తెలిసిందే. ఓ ఎలుక ఆ మండపంలో మంగళవారంనాడు నృత్యం చేసి గ్రామస్థులను అలరించింది.
వినాయకుడి గ్రామస్థులు సోమవారం రాత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అకస్మాత్తుగా ఓ ఎలుక వినాయకుడి విగ్రహం వద్దకు వచ్చింది. భక్తులు వడపప్పు, పానకం సమర్పించారు. ఆ వడపప్పు తిని, పానకం తాగేసి ఎలుక నృత్యం చేయడం ప్రారంభించింది.
ముందటి కాళ్లు రెండు పైకి ఎత్తి సినిమా పాటలకు గంతులేసింది. తోక పైకెత్తి లయబద్దంగా ఆడించడమే కాకుండా ముందటి కాళ్లతో చప్పట్లు కూడా కొట్టింది. ప్రజలు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే, చీకటిని చాటుగా చేసుకుని అది అక్కడి నుంచి పారిపోయింది.
ఎపికి ప్రత్యేక హోదా రావాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటూరులోని కొత్తపేటలో ఆయన ఆ పూజలు నిర్వహించారు. ప్రత్యేక హోదాతో త్వరితగతి అభివృద్ధి జరుగుతుందని ఆనయ అన్నారు.