వైఎస్ జగన్కు రతన్ టాటా లేఖ: ఏపీని ఆదుకుంటామంటూ భరోసా: భారీగా సాయానికి హామీ..!
అమరావతి: పారిశ్రామిక దిగ్గజం, టాటా ట్రస్ట్ ఛైర్మన్ రతన్ టాటా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. కరోనా వైరస్ బారిన పడిన సతమతమౌతోన్న ఏపీని ఆదుకోవడానికి వీలైనంత సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. కరోనా వల్ల ఇదివరకు చరిత్రలో ఎప్పుడూ లేనంత కల్లోలాన్ని మనం చూస్తున్నామని, తమ ట్రస్టు తరఫున దీన్ని అధిగమించడానికి ట్రస్ట్ తరఫున సహాయం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Recommended Video
మన పొరుగు రాష్ట్రంలో 30 వరకూ లాక్డౌన్ పొడిగింపు: సీఎం ఆదేశాలు: జూన్ 17 వరకు స్కూళ్లు క్లోజ్
రాష్ట్రాన్ని ఆదుకోవడానికి అవసరమైన సహాయాన్ని అందించాలని విజ్ఙప్తి చేస్తూ ఇదివరకు వైఎస్ జగన్ రతన్ టాటాకు లేఖ రాశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి విధించిన లాక్డౌన్ వల్ల రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయని, ఫలితంగా రాష్ట్రానికి ఆదాయం లేదంటూ అదే సమయంలో రాష్ట్ర ప్రజల సంక్షేమానికి భారీగా నిధులను ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని వైఎస్ జగన్ కోరారు.
ఈ లేఖకు రతన్ టాటా స్పందించారు. వైఎస్ జగన్కు ప్రత్యుత్తరం ఇచ్చారు. మన జీవిత కాలంలో ఎప్పుడూ చూడని అతి పెద్ద సంక్షోభం తలతెత్తిందని, దీన్ని ధీటుగా, ఐక్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. కరోనా వైరస్ సృష్టిస్తోన్న విధ్వంసాన్ని, అది మిగిల్చిన సంక్షోభాన్ని అధిగమిస్తామని రతన్ టాటా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కరోనా వైరస్ను పారద్రోలడానికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వం శక్తివంచన లేకుండా పోరాడుతున్నాయని, వారికి ట్రస్టు తరఫున అండగా నిలుస్తామని రతన్ టాటా చెప్పారు.
టాటా ట్రస్టు, టాటా గ్రూప్ సంస్థల తరఫున పలు రాష్ట్రాలకు తాము వీలైనంత మేర సహాయాన్ని అందజేస్తున్నామని రతన్ టాటా తన లేఖలో పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకిన పేషెంట్లకు అవసరమైన వైద్య పరికరాలు, టెస్ట్ కిట్స్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఏపీ సహా పలు రాష్ట్రాల అవసరాలను తీర్చడానికి తాము తప్పకుండా ప్రయత్నిస్తామని అన్నారు. కరోనా వైరస్ను ఎదుర్కొనడానికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, వారి ప్రయత్నాలకు తాము అండగా ఉంటామని రతన్ టాటా హామీ ఇచ్చారు.