దుమ్ము రేపుతోంది! 10,751,547+.. రావాలి జగన్..కావాలి జగన్ పాట: గిన్నిస్ రికార్డ్ అవకాశం?
అమరావతి: యూట్యూబ్ తాజా సంచలనం. హిట్ల మీద హిట్లు. వ్యూస్ మీద వ్యూస్. ఓ ప్రాంతీయ రాజకీయ పార్టీ రూపొందించిన తన ఎన్నికల ప్రచారానికి రూపొందించుకున్న ఓ పాటను చూడటానికి జనం విరగబడుతున్నారు. యూట్యూబ్ ను ఎగబడి చూస్తున్నారు. అదే- రాావాలి జగన్, కావాలి జగన్. ప్రస్తుతం ఈ లిరిక్.. యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. ఈ పాటను విడుదల చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే కోటి మందికి పైగా చూశారంటే మాటలు కాదు. సినిమా రంగంతో సంబంధం లేని, ఓ ప్రాంతీయ రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్న పాటను కోటి మందికి పైగా చూడటం ఇదే తొలిసారి అని అంటున్నారు. దీనితో- గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కించడానికి గల అవకాశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలిస్తున్నారు.
చంద్రబాబును నమ్ముకుంటే గోదాట్లో కలిసినట్టే!
అన్నీ వెనక్కే!
ఎన్నికల ప్రచార సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి, వారిని ఉత్తేజితులను చేయడానికి పాటల ఆల్బమ్ లను రూపొందించుకోవడం సహజమే. ఇదివరకు `తరలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా` అంటూ టీడీపీ పలు పార్టీ ప్రచార గీతాలను రూపొందించి, జనం మీదికి వదిలింది. భారతీయ జనతా పార్టీ కూడా నరేంద్రమోడీ కేంద్రంగా చేసుకుని కొన్ని ఆల్బమ్ లను తయారు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఆ పార్టీ నాయకులు ఇప్పటికే పలు ఆల్బమ్ లను రూపొందించి, సోషల్ మీడియాలో విడుదల చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు 14 నెలల పాటు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో సాగించిన పాదయాత్రలో అనేక పాటలు విడుదలయ్యాయి. తరువాత కూడా పాటలను రూపొందిస్తోందా పార్టీ.
10,751,547+..
సోమవారం ఉదయం నాటికి యూట్యూబ్ లో ఈ పాటను చూసిన వారి సంఖ్య కోటి మందికి పైమాటే. 10,7,51,547 మంది ఈ పాటను చూశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి ఈ పాటకు వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్ లో దీన్ని చూస్తున్న వారి సంఖ్యలో ఏపీ టాప్ లో ఉంది. తెలంగాణ రెండో స్థానంలో, కర్ణాటక మూడో స్థానంలో ఉన్నాయి. కర్ణాటకలో బెంగళూరు సహా తెలుగువారి ప్రాబల్యం అధికంగా ఉన్న బళ్లారి, రాయచూరు, బీదర్, యాద్గిర్ జిల్లాల నుంచి వ్యూస్ వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఏపీ, తెలంగాణల్లో దాదాపు అన్ని జిల్లాల నుంచీ రావాలి జగన్, కావాలి జగన్ ను చూస్తున్నట్లు తేలింది.
విదేశాల్లోనూ డిమాండ్..
అమెరికా, ఆస్ట్రేలియాల్లో కూడా ఈ పాటకు వ్యూస్ వస్తున్నాయని వైఎస్ఆర్ సీపీ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. కాలిఫోర్నియా, చికాగో వంటి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. అలాగే- దుబాయ్, కువైట్, అబుధాబి, బహ్రెయిన్, ఖతార్ నుంచి కూడా వ్యూస్ వస్తున్నాయి. అరబ్ దేశాల జాబితాలో కువైట్ టాప్ లో నిలిచిందని, దుబాయ్ ద్వితీయస్థానంలో ఉన్నట్లు సమాచారం.
స్మార్ట్ ఫోన్ల నుంచే..
ప్రస్తుతం దాదాపు అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇంటర్ నెట్ డేటా వినియోగించే స్మార్ట్ ఫోన్ల సంఖ్య సుమారు 70 శాతంగా ఉంటోంది. ఫలితంగా- రావాలి జగన్, కావాలి జగన్ పాటను స్మార్ట్ ఫోన్ల ద్వారా యూట్యూబ్ లో ఈ పాటను అధికసంఖ్యలో ప్రజలు చూస్తున్నట్లు తెలుస్తోంది. డెస్క్ టాప్, ల్యాప్ టాప్ లతో పోల్చుకుంటే స్మార్ట్ ఫోన్ల ద్వారానే ఈ పాటను అధికమంది తిలకిస్తున్నారు.
ఎవరు రాశారీ పాటను
`రావాలి జగన్.. కావాలి జగన్` అనేది వైఎస్ఆర్ సీపీ స్లోగన్. దీన్నే పల్లవిగా తీసుకుని ఓ పాటను రాయించారు. తెలంగాణకు చెందిన ప్రముఖ గేయ రచయిత, అభ్యుదయవాదిగా పేరున్న సుద్దాల అశోక్ తేజ రాసిన పాట ఇది. ఫిదా చిత్రానికి సంగీతాన్ని అందించిన శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని కంపోజ్ చేశారు. మనో పాటను ఆలపించారు. జగన్ పాదయాత్రలోని కొన్ని హత్తుకునే ఘటనలను ఎంపిక చేసుకుని, పాటను రూపొందించారు. ఈ పాట లేటెస్ట్ గా ఈ పాట యూట్యూబ్ సెన్సేషన్ గా మారింది.
ఆల్ టైమ్ రికార్డ్..
సినిమా పరిభాషలో చెప్పుకోవాలంటే `ఆల్ టైమ్ రికార్డ్`గా అభివర్ణిస్తున్నారు పార్టీ అభిమానులు. యువతను విపరీతంగా ఆకట్టుకోవడం వల్లే ఈ రికార్డు సాధ్యపడిందనేది వారి వాదన. ఈ పాటను వీక్షించిన వారిలో 20 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు వారు సంఖ్య అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ సినీ పాటకు ధీటుగా జగన్ పై రాసిన గీతాన్ని ప్రజలు అభిమానిస్తున్నారని అంటున్నారు. రోజులు గడిచే కొద్దీ పాటను చూసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.