రిసార్టులు, రేవ్ పార్టీలపై దాడులు: 10మంది టెక్కీలు అరెస్ట్
హైదరాబాద్: రేవ్ పార్టీల పైన పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ అవి తగ్గడం లేదు. రంగారెడ్డి జిల్లా మొయినాబాదులోని ఓ ఫాంహౌస్ పైన పోలీసులు దాడి చేసి సుమారు 40 మందిని శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. అది మరవకముందే మరికొన్ని వెలుగు చూశాయి.
ఇదే మండలంలోని అప్పారెడ్డిగూడలోని ఫామ్ హౌస్లు, రిసార్టుల పైన పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 10 మంది సాఫ్టువేర్ ఇంజనీర్లను అరెస్టు చేశారు. హుక్కా సామాగ్రి, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నదీమ్ నగర్లో 21 మంది యువకులను అరెస్టు చేశారు.
ఏనుగుల బీభత్సం
చిత్తూరు జిల్లా వి కోట మండలం బీసీపల్లిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగుల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 12 ఏనుగులు పొలాల పైన దాడి చేసి దాదాపు 20 ఎకరాల్లోని మొక్కజొన్న, బీన్స్, బొప్పాయి, టమోటా తదితర పంటలను పూర్తిగా ధ్వంసం చేశాయి.
సముద్రంలో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా వాకాడు మండలం తూపులిపాలెం వద్ద శనివారం నాడు సముద్రంలో గల్లంతైన విద్యార్థి మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది. గూడురు పట్టణానికి చెందిన బాలాజీ స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లి ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతయ్యాడు. ఈ రోజు సముద్రం వద్ద ఉన్న వంతెన సమీపంలో మృతదేహం లభ్యమైంది.
ప్రధానోపాధ్యాయుడిని నిర్బంధన
అనంతపురం జిల్లా కదిరి మండలం పట్నంలో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పదో తరగతి పరీక్షా కేంద్రం మార్పును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన గ్రామస్థులు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని నిర్బంధించారు.