చిన్నారుల బాధ, కంటతడిపెట్టిన మంత్రి రావెల, ప్రత్యేక హోదాపై కావూరి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు మంగళవారం నాడు కంటతడి పెట్టారు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఎయిడ్స్తో చిన్నారులు పడుతున్న బాధలు చూసి ఆయన తట్టుకోలేకపోయారు. ఏకంగా వేదిక దిగి చిన్నారులను అక్కున చేర్చుకొని, కంటతడి పెట్టారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నలభై రెండు మంది ఎయిడ్స్ బాధిత చిన్నారులతో వరల్డ్ విజన్ ఇండియా అనే సంస్థ గుంటూరులో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనికి రావెల హాజరయ్యారు. ఆయన చిన్నారులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పలువురు చిన్నారులు తమ కష్టాలు చెప్పుకున్నారు. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాకు చెందిన పదేళ్ల బాలుడు కూడా మాట్లాడాడు. మా ఇంటికి వస్తావా.. పెంచుకుంటాను అనిమంత్రి ఆ బాలుడితో అన్నాడు. దానికి ఆ బాలుడు.. తన పిన్ని బాగా చూసుకుంటోందని, అక్కడే ఉంటానని చెప్పాడు.
ఎయిడ్స్ చిన్నారులు ఆరోగ్యపరంగానే కాక సామాజికంగానూ తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి ముందు ఏకరువు పెట్టారు. దీంతో భావోద్వేగానికి గురైన మంత్రి వేదిక దిగి చిన్నారులను దగ్గరకు తీసుకుని సముదాయించారు. ఈ సందర్భంగా ఆయన కళ్ల వెంట నీళ్లు సుడులు తిరిగాయి.
హోదా వచ్చే వరకు పోరాడుతాం: కావూరి
ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడుతామని బిజెపి నాయకుడు, మాజీ ఎంపీ కావూరి సాంబశివ రావు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించినప్పుడు కాంగ్రెస్ ఎన్ని సమస్యలు ఉన్నాయో, అమలు చేసేందుకు బిజెపికి అంతకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయన్నారు.
హైదరాబాద్లో బీంరావ్ వాడను మర్చిపోయారా: టిడిపి
నాగార్జున విశ్వవిద్యాలయాన్ని ప్రక్షాళణ చేస్తామని గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షులు ఆంజనేయులు చెప్పారు. త్వరలో జిజిహెచ్ అభివృద్ధి కమిటీ నియమిస్తామన్నారు. హైదరాబాదులోని భీంరావు వాడలో నిరుపేదల ఇళ్లు కూల్చి గాంధీ భవన్ నిర్మించిన విషయం జగన్ మర్చిపోయారా అని ప్రశ్నించారు.