జగన్ మెంటల్ పేషెంట్: రావెల, అంధ్ర కవులను తీసేశారని గంటా
హైదరాబాద్: ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు మానసిక రోగిగా అభివర్ణించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుతో వైయస్ జగన్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ మానసిక రోగంతో బాధపడుతున్నారని ఎద్దేవాచేశారు. చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత జగన్కు లేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునేవారితో జగన్ కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. జగన్ కుట్ర రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని రావెల కోరారు
జగన్ దొంగ దీక్షలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధి ఉంటే జగన్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని ఆయన సవాల్ విసిరారు. పట్టిసీమపై అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నారని ఆయన విమర్శించారు. ఏం చేశారని వైయస్ రాజశేఖర రెడ్డి ఫొటో శాసనసభలో పెట్టాలని ఆయన అడిగారు.
సిలబస్లో ఆంధ్రా కవుల పాఠాలను తొలగించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వితండవాదం చేస్తోందని మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అంబేద్కర్, తెలుగు వర్సిటీ వివాదాలపై హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అడ్మిషన్లు నిర్వహించాలని మంత్రి కోరారు. అదేవిధంగా తమిళనాడులో తెలుగును ప్రోత్సహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రాస్తామని గంటా శ్రీనివాసరావు తెలిపారు.
మోడీ, వెంకయ్య, చంద్రబాబులపై కేసులు
ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిలపై ఈ నెల 7,8,9 తేదీల్లో పోలీసు స్టేషన్లలో కేసులు పెడుతామని కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూ చెప్పారు. శుక్రవారంనాడు జరిగిన కృష్ణా జిల్లా కాంగ్రెసు కమిటీ సమావేశం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. వారు ముగ్గురు హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు.