అజ్ఞాతం నుంచి వెలుగులోకి రవిప్రకాశ్.. సంచలన నిజాలు.. టీవి9 రహాస్యాలు (వీడియో)
Recommended Video
టీవీ9 వ్యవహారంలో వివాదాస్పదమై అజ్ఞాతంలో ఉన్న రవి ప్రకాశ్ వీడియో సందేశం విడుదల చేసారు. టీవీ9 స్థాపన దగ్గర నుండి అమ్మకం వరకు చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. జూపల్లి రామేశ్వరరావు తనను పాలేరుగా ఉండమన్నారని..బెదిరింపులకు గురి చేసారని..తప్పుడు కేసులు నమోదు చేసారని చెప్పుకొచ్చారు. ఆయన చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాను ముందడుగు వేయాలని నిర్ణయించానని రవి ప్రకాశ్ స్పష్టం చేసారు.
వీడియో సందేశం ద్వారా..
కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాశ్ తన వివరణను వీడియో సందేశం ద్వారా వినిపించారు. తాను టీవీ9 స్థాపించిన సమయంలో శ్రీనిరాజు పెట్టుబడి పెట్టారని..కొద్ది కాలం క్రితం ఆయన లాభాలతో బయటకు వెళ్లానని చెబితే తాను అంగీకరించానని చెప్పుకొచ్చారు. తిరిగి పెట్టుబడుదారుల కోసం ప్రయత్నిస్తుండగా మెగా కృష్ణారెడ్డి తన వద్దకు వచ్చి మిత్రులతో కలిసి పెట్టుబడి పెడతానని చెబుతూ..ఎడిటోరియల్ స్వేచ్చ ఇస్తానని మాట ఇచ్చారని చెప్పారు. అయితే, ఆయన మై హోం రామేశ్వరరావును మెజార్టీ వాటా దారుడిగా తీసుకు రాగా, అదే విషయాన్ని కృష్ణారెడ్డిని ప్రశ్నించానన్నారు. రామేశ్వరరావుతో సైతం తాను ఒక మైనార్టీ స్టేక్ హోల్డర్ అని..అగ్రిమెంట్ అసవరమని చెప్పానని వివరించారు. కానీ, రామేశ్వర రావు మాత్రం తనది కుటుంబ వ్యాపారం అని చెబుతూ.. నీతో ఎటువంటి రాత పూర్వక ఒప్పందం చేసుకోలేనని స్పష్టం చేసారన్నారు. నీవు పాలేరులా పని చేసుకో.. జీతం తీసుకొని నీ పని నీవు చేసుకో అని హెచ్చరించారని రవి ప్రకాశ్ చెప్పుకొచ్చారు.
బెదిరించారు..తప్పుడు కేసులు పెట్టారు..
తాను కేవలం అగ్రిమెంట్ రాసుకోవాలని కోరితే..రామేశ్వర రావు తనను బెదిరించారని, చెప్పింది వినకపోతే ఇబ్బంది పడతావని హెచ్చరించారని వివరించారు. ఆ బెదిరింపుల ఫలితమే తన పైన మూడు దొంగ కేసులు పెట్టారని రవి చెప్పుకొచ్చారు. కొన్ని ఛానళ్లు తనను ఉగ్రవాదిగా ప్రచారం చేసి ఆనందపడుతున్నారని ఆక్షేపించారు. తనకు..శివాజీ మధ్య ఉన్న ఒప్పందం కోర్టులో ఉందని..కోర్టు అనుమతి లేకుండా ఆ వ్యవహారం పైన పోలీసులు ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. రెండో కేసుగా చెబుతున్న దాంట్లో తన వద్ద పని చేస్తున్న దేవేంద్ర అగర్వాల్ సంతకం ఫోర్జరీ చేసానని ఫిర్యాదు చేసారని..అతను తన దగ్గర పార్ట్ టైం ఉద్యోగినంటూ పేర్కొన్నారు. దేవేంద్ర అగర్వాల్ను రాత్రి అంతా బంధించి..హింసించి తమ పేర్లను డైరెక్టర్లుగా అప్లోడ్ చేయటానికి ప్రయత్నించారని రవి ప్రకాశ్ వివరించారు. ఇక, టీవీ9 లోగా అమ్ముకున్నానని చెబుతున్నారని..అసలు లోగో సృష్టికర్తే తాననే విషయం కొనుగోలు సమయంలోనే తెలుసుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చారు.
పోలీసులు భాగస్వాములయ్యారు..ముందడుగు వేస్తాను..
మై హోం గ్రూపుకు పోలీసులు భాగస్వాములుగా పని చేస్తున్నారని రవి ప్రకాశ్ ఆరోపించారు. రామేశ్వరరావు ఆదేశిస్తే పోలీసులు పాటిస్తున్నారని విమర్శించారు. తాను ఇప్పటి వరకు చెప్పిన విలువలు పాటించాలా లేక ధనిక స్వాములు పెట్టిన దొంగ కేసులకు భయపడి వారికి ఊడిగన చేయాల అని ప్రశ్నించారు. భవిష్యత్ తరాల కోసం ఈ భయాలను పక్కన పెట్టాలని నిర్ణయించానన్నారు. ధనిక స్వామ్యానికి ప్రజాస్వామ్యం దాసోహం కాకూడదని నిర్ణయించి.. పాత్రికేయ స్వేచ్ఛ కోసం ముందడుగు వేయాలని నిర్ణయించానని రవి ప్రకాశ్ చెప్పుకొచ్చారు.