ఏపీకి ఐటీఐఆర్పై మేం ఏం చేయలేం: కేంద్రమంత్రి రవిశంకర్, ఉప ఎన్నికల ఫలితాలపై ఇలా
అమరావతి/న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నాలుగు లోకసభ, 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. బీజేపీ మూడు లోకసభ సిట్టింగులకు గాను రెండింటిని దక్కించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి, బీజేపీ నేత రవిశంకర ప్రసాద్ ఈ అంశంపై స్పందించారు.
ఉప ఎన్నికల ఫలితాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎదురుగాలిగా భావించవద్దని అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికల ఫలితాలు ఎక్కడైనా స్థానిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయని చెప్పారు. థర్డ్ ఫ్రంట్ ప్రభావం ఏమీ ఉండదన్నారు. వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామన్నారు. తాను ప్రధాని అవుతానని రాహుల్ చెప్పుకోవడంలో తమకు అభ్యంతరం లేదన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా బీజేపీ గెలుచుకుంటూ వస్తున్నప్పటికీ ఉప ఎన్నికల్లో సత్తా చాటడం లేదు.
ఐటీఐఆర్ విషయంలో కేంద్రం చేసేదేం లేదు
మరోవైపు, ఏపీలోని పలు అంశాలపై కూడా స్పందించారు. ఐటీఐఆర్ విషయంలో కేంద్రం చేసేది ఏమీ లేదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఐటీఐఆర్ పైన విధాన పరమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భూమి విషయంలో సమస్యలు తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు.
ఏపీ స్థలం ఇస్తే నోటిఫై చేయడమే
అదే సమయంలో ఆయన హైకోర్టు విభజన పైన కూడా స్పందించారు. హైకోర్టు విభజనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థలం ఇస్తే దానిని నోటిఫై చేయడం తప్ప చేసేదేమీ లేదని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఏపీ స్థలం ఇవ్వాలన్నారు. పార్టీ పరంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
హోదాపై మోడీ హామీ ఇవ్వలేదు
కాగా, అంతకుముందు రోజు కూడా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఏపీకి చెందిన పలు అంశాలపై స్పందించారు. నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుతానని చెప్పారని, వాటిని నెరవేర్చుతున్నామని, అందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ మోడీ ప్రత్యేక హోదాపై హామీ ఇవ్వలేదని చెప్పారు. రాజ్యసభలో హోదా కోసం వెంకయ్య పోరాడిన మాట నిజమేనని, కానీ మోడీ హోదాపై హామీ ఇచ్చారనే మాట మాత్రం సరికాదన్నారు.
ఎన్నికలను సీరియస్గా తీసుకుంటాం
ప్యాకేజీ కోసం ఓ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేయాలని, నిధులు పంపిస్తామంటే ఏపీ ప్రభుత్వం పంపించలేదని జితేంద్ర సింగ్ చెప్పారు. ఆ డబ్బుల కంటే టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వెళ్లేందుకే ఆసక్తి చూపించిందన్నారు. వచ్చే ఎన్నికలను ఏపీలో చాలా సీరియస్గా తీసుకుంటామని ఆయన చెప్పారు.