హైద్రాబాద్కు ఢోకాలేదు, ఇద్దరు సీఎంలు..: కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయినంత మాత్రాన ఐటి రంగానికి సంబంధించినంత వరకూ హైదరాబాద్ ప్రత్యేకత ఏమాత్రం దెబ్బతినదని కేంద్ర ఐటి, టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. దేశ ఐటి రంగంలో హైదరాబాద్, బెంగళూరు తమ స్థానాన్ని పదిల పర్చుకుంటాయన్నారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన తరువాత సిఎంల మధ్య కీచులాటలు, కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యల కారణంగా పెట్టుబడిదారులు రావటానికి జంకే అవకాశాలున్న నేపథ్యంలో హైదరాబాద్ ఐటిపై పరిస్థితి ప్రభావం ఉంటుందా? అన్న మీడియా ప్రశ్నకు పైవిధంగా వ్యాఖ్యానించారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు తనతో సంప్రదింపులు జరిపారని, ఇద్దరూ ఐటీపై విపరీతమైన ఆసక్తి చూపుతున్నారన్నారు. చంద్రబాబు, కేసీఆర్లు కలిసి పని చేస్తామని చెప్పారన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల పాలనలో ఐటీ అభివృద్ధికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నామన్నారు.
రానున్న మూడేళ్లలో దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలను ఆప్టిక్ ఫైబర్తో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇంతవరకూ మొబైల్ సదుపాయానికి నోచుకోని గ్రామాలకు త్వరలోనే ఆ సదుపాయం కల్పిస్తామన్నారు. ప్రధాని మోడీకి అత్యంత ప్రీతిపాత్రమైన 'డిజిటల్ ఇండియా' పథకం అమలుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
1.3 లక్షల కోట్లను పథకం కోసం ఖర్చు పెడుతున్నట్టు మంత్రి చెప్పారు. అతి త్వరలోనే ఉచిత రోమింగ్ మొదలవుతుందన్నారు. ప్రజలు తమ కంప్యూటర్లను వైరస్ నుండి, ఇతర అవాంఛిత ప్రోగ్రాంల నుండి రక్షించుకొని, వాటిని తొలగించుకునేందుకు దోహదపడేలా రూ.800 కోట్లతో జాతీయ సైబర్ సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.