'బాబు, లోకేష్లకు సోషల్ మీడియా భయం', కిడ్నాప్ కేసు పెట్టిన రవికిరణ్ భార్య
పొలిటికల్ పంచ్ వెబ్సైట్ రన్ చేసే ఇంటూరి రవికిరణ్ను అరెస్ట్ చేయడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయ సాయి రెడ్డి, అంబటి రాంబాబులు శుక్రవారం నాడు మండిపడ్డారు.
అమరావతి: పొలిటికల్ పంచ్ వెబ్సైట్ రన్ చేసే ఇంటూరి రవికిరణ్ను అరెస్ట్ చేయడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయ సాయి రెడ్డి, అంబటి రాంబాబులు శుక్రవారం నాడు మండిపడ్డారు. సోషల్ మీడియా అంటే చంద్రబాబు, నారా లోకేష్లు భయపడుతున్నారన్నారు.
సోషల్ మీడియా అంటే చంద్రబాబు, లోకేష్లకు ఎందుకు భయమని, పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ అరెస్టు చేయడమేనని అందుకు నిదర్శనం అన్నారు.
ప్రభుత్వ అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తు అరెస్టు చేస్తారా అని నిలదీశారు. రవికిరణ్కు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని తెలిపారు. సోషల్ మీడియాకు సంకెళ్లు వేయాలనుకోవడం పిచ్చితనం అన్నారు
సోషల్ మీడియాను లోబర్చుకునే ప్రయత్నం
మీడియాను లోబర్చుకున్న చంద్రబాబు, సోషల్ మీడియాను తన అదుపులోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయ సాయి రెడ్డి ఆగ్రహం
రవికిరణ్ అరెస్టుపై విజయ సాయి రెడ్డి కూడా స్పందించారు. రవికిరణ్ను మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచాలని లేదంటే అసెంబ్లీ సెక్రటరీ, ఎస్పీ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని చెప్పారు.
వేకువజామున అరెస్ట్ ఎలా?
వేకువజామునే ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఉదయం ఆరు గంటల తర్వాతనే అరెస్ట్ చేయాలన్నారు. కానీ మూడున్నర గంటలకే అరెస్ట్ చేశారన్నారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.
రవికిరణ్ సతీమణి స్పందన
తన భర్తను అరెస్ట్ చేసినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని రవికిరణ్ సతీమణి చెప్పారు. ఉదయం మూడున్నర గంటలకు అరెస్ట్ చేశారన్నారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లినందుకు కిడ్నాప్ కేసు వేయనున్నట్లు ఆమె తెలిపారు. ఆ తర్వాత ఆమె కిడ్నాప్ కేసు పెట్టారు కూడా.