జాదుగాడు.. అమ్మాయిలపై కన్నేస్తే అంతే: విశాఖలో 'రవి'లీలలు
రవికుమార్ బాధితుల్లో వర్ధమాన గాయని కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సదరు గాయని నుంచి రవికుమార్ దాదాపు రూ.50లక్షల దాకా లాగాడని టాక్.
విశాఖపట్నం: ప్రముఖులతో.. పలుకుబడిగల వారితో.. ఫోటోలు దిగి.. తానో బడా బిజినెస్ మెన్ తరహాలో పోజు కొడుతాడు. అమ్మాయిలతో పరిచయాలు పెంచుకోవడం.. సొంత డబ్బా కొట్టుకుని, వారిని వశపరుచుకోవడం.. ఆపై అందినకాడికి దోచుకుని వారిని గుల్ల చేయడం అతగాడి పని.
మోసగాళ్లకే మోసగాడు తరహాలో విశాఖలో మహాముదురుగా పేరు తెచ్చుకున్న రవికుమార్ అనే ఊసరవెల్లి బాగోతాన్ని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. అతని బారిన పడిన బాధితుల నుంచి వివరాలు సేకరించి అతగాడి లీలలను బట్టబయలు చేసింది.
ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి:
ఉద్యోగం పేరిట సౌజన్య అనే బ్యాంకు ఉద్యోగినిని రవికుమార్ మోసం చేశాడు. విశాఖ కో-అపరేటివ్ బ్యాంకు డైరెక్టర్లలో నేనూ ఒకడిని అని గొప్పలు పోయాడు. మా బ్యాంకులో చాలా ఖాళీలున్నాయి ఉద్యోగం ఇప్పిస్తా రమ్మన్నాడు.
ఎంవీపీ కాలనీలోని ఓ బ్యాంకులో సౌజన్య పనిచేస్తుండగా.. ఆ బ్యాంకుకు రవికుమార్ తరుచూ వెళ్లేవాడు. సౌజన్యతో పరిచయం పెంచుకుని మాయ మాటలతో ఆమెను బోల్తా కొట్టించాడు. నిజంగానే ఉద్యోగం ఇప్పిస్తాడని నమ్మిన సౌజన్య.. భర్త సింగపూర్ వెళ్లినా.. తాను మాత్రం విశాఖలోనే ఉండిపోయింది.
నిజానికి పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి సౌజన్య హైదరాబాద్ కు వెళ్లింది. అయితే ఫోన్ ద్వారా సౌజన్యను రవికుమార్ టార్గెట్ చేసుకున్నాడు. నిత్యం మాయ మాటలు చెబుతూ.. ఆమెను మభ్యపెట్టేవాడు.
ఈ కారణాలతోనే.. భర్త సింగపూర్ వెళ్లినా.. రవికుమార్ ఉద్యోగం ఇప్పిస్తాడన్న భరోసాతో హైదరాబాద్ నుంచి తిరిగి విశాఖ చేరుకుంది. తీరా ఇక్కడికొచ్చాక.. సెక్యూరిటీ డిపాజిట్ లు, వగైరా వగైరా పేర్లతో మొత్తం మూడు లక్షలు ఆమె వద్ద నుంచి దండుకున్నాడు.
ఆఖరికి రవికుమార్ ను గుడ్డిగా నమ్మి తన ఒరిజినల్ సర్టిఫికెట్లను కూడా అతని చేతిలో పెట్టింది. మొత్తానికి ప్లేటు ఫిరాయించి.. ఆ ఉద్యోగం కాదు గానీ మధురవాడ బ్రాంచ్ లో ఖాళీలున్నాయి అక్కడ ఉద్యోగమిస్తా పదమన్నాడు. నమ్మి అతని వెంట వెళ్లినందుకు కారులోనే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.
దీంతో సౌజన్య గట్టిగా ప్రతిఘటించి.. కేకలు వేయడంతో ఆమెను కారు నుంచి దించి అక్కడినుంచి పరారయ్యాడు. ఇక్కడితో అయినా ఆగిపోయాడా! అంటే అదీ లేదు. సౌజన్య భర్తకు, ఆమె తల్లిదండ్రులకు ఫోన్లు చేసి బెదిరించాడు. దీంతో వివాహ సౌజన్య సంబంధం కూడా బెడిసికొట్టింది. పోలీస్ ప్రత్యేక విభాగంలో ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోయింది.
బిల్డర్ అనే పోజు కొట్టి..:
రమ్య అనే మహిళ విశాఖ తీరంలో సొంతిల్లు కోసం వెతుకుతోంది. విషయం ఎలా తెలిసిందో గానీ మొత్తానికి రవికుమార్ ఆమెకు గాలం వేశాడు. వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలకు తాను బినామీ అంటూ నమ్మబలికాడు.
వికాస్ బిల్డర్స్ కు ఎండీనని, బెంగుళూరులో ఓ భారీ వెంచర్ ప్లాన్ చేస్తున్నానని రమ్యకు చీటికి మాటికి ఫోన్లు చేశాడు. మొత్తానికి ఆ పరిచయంతో రమ్యను మభ్యపెట్టాడు. బీచ్ రోడ్డులోని లాసన్సబే కాలనీలో రెండున్నర కోట్ల విలువ చేసే ఓ బిల్డింగ్ ను తనదే అని చెప్పాడు.
అయితే అగ్రిమెంట్ తన పేరు మీద చేయిస్తే ఇబ్బందులు వస్తాయని, నీ పేరు మీద చేయించుకో అని రమ్యను ఊరించాడు. అలా..ఆమె వద్ద నుంచి అందినకాడికి దోచుకున్నాడు. నాలుగు లక్షలు ఒకసారి, మూడు లక్షలు ఒకసారి.. ఇలా నగదుతో పాటు బంగారం కూడా దోచేసుకున్నాడు.
ఇదొక్కటే కాదు.. విశాఖలో అమ్మకానికి పెట్టిన ఇన్ఫోటెక్ కంపెనీని జగన్ బంధువులు కొనుగోలు చేస్తున్నారని, అయితే అగ్రిమెంట్ నీ పేర జరిగితే ఎలాంటి చిక్కులు ఉండవని నమ్మబలికాడు. మళ్లీ అతగాడి మాటలు నమ్మి దాదాపు రూ.46లక్షలు సమర్పించుకుంది.
రవికుమార్ పది ఫోన్లు వాడుతాడని ఏ ఫోన్ నంబర్ ఎప్పుడు వాడుతాడో ఎవరికీ తెలియదని చెప్పింది. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది అమ్మాయిలను పరిచయం చేశానని, దేవుడి ప్రసాదం, పూజా ద్రవ్యం,పేరిట గంజాయి కలిపిన పదార్థాలు వారికి తినిపించేవాడని రమ్య తెలిపింది.
మత్తులో ఉన్న ఆ అమ్మాయిలను ఫోటోలను చిత్రీకరించి ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడేవాడని రమ్య పేర్కొంది. రవికుమార్ బాధితుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కోటేశ్వరరావు, ఓ బ్యాంకు మేనేజర్, వర్ధమాన గాయని కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సదరు గాయని నుంచి రవికుమార్ దాదాపు రూ.50లక్షల దాకా లాగాడని టాక్.
అసలు ఇంతకీ ఎవరితను?
నిజానికి రవికుమార్ అనే వ్యక్తి కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే చదువుకున్నాడు. కానీ నల్లకోటు లాయర్ నని చెప్పుకుని తిరుగుతాడు. లా కోర్సులో చేరిన అతను ఏడాదికే డ్రాప్ అయ్యాడు. అయితే ఎలా సంపాదించాడో తెలియదు గానీ లాయర్ పట్టా మాత్రం సంపాదించాడని బాధితులు చెబుతారు.
ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని చెప్పుకుని అమ్మాయిలను ట్రాప్ చేయడమే అలవాటుగా మార్చుకున్నాడు. కాగా, బాధితులకు తప్పక న్యాయం చేస్తామని విశాఖ సీపీ యోగానంద్ తెలిపారు.