ఇసుక కొరతకు నిరసనగా రెండోరోజు ఇంటి వద్దే దీక్ష కొనసాగిస్తున్న కొల్లు రవీంద్ర
ఏపీలో ఇసుక కొరత తీవ్రతరమైంది . అయినా పాలకుల పట్టింపులేనితనం వల్ల నిర్మాణ రంగం కుదేలైంది. జగన్ కొత్త ఇసుక పాలసీ ప్రవేశపెట్టినప్పటికీ ఇసుక మాత్రం అందడం లేదు. దీంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోసం నానా అగచాట్లు పడుతున్నారు. ఇక ఇసుక కొరతను నిరసిస్తూ నిన్న మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిరసన దీక్ష చేపట్టారు. ఇక వీరికి పోటీగా వైసీపీ నేతలు సైతం టీడీపీ కుయుక్తులకు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టారు. దీంతో పోలీసులు కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు. కొల్లు రవీంద్ర దీక్షను భగ్నం చేశారు. కానీ నేడు సైతం కొల్లు రవీంద్ర దీక్షను కొనసాగిస్తున్నారు. తన ఇంటి వద్దనే ఆయన నిరసన దీక్ష చేపట్టారు.
మచిలీ పట్నంలో ఉద్రిక్తత ..మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్
కృత్రిమ ఇసుక కొరతకు నిరసనగా ఆయన రెండో రోజు తన దీక్షను కొనసాగిస్తున్నారు. కొల్లు రవీంద్ర దీక్షకు భవన నిర్మాణ కార్మికులు మద్దతు తెలిపారు. అలాగే పార్టీ కార్యకర్తలు, నేతలు సంఘీభావం తెలిపారు. నిన్న ఆయనను అరెస్ట్ చెయ్యటంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. మరోపక్క ఒక్క టీడీపీనే కాదు, బీజేపీ, జనసేన పార్టీలు సైతం ఏపీలో ఇసుక కొరతపై తీవ్రంగా మండిపడుతున్నాయి. మరోమారు ఆందోళనలకు దిగుతామని హెచ్చరిస్తున్నా , ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వ తీరు మాత్రం మారటం లేదు. ఏపీలో ఇసుక కొరత తీరటం లేదు. ఇక తాజాగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష నేపథ్యంలో మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడినా ఆయనను అరెస్ట్ చేసినా రెండో రోజు కూడా ఆయన తన దీక్షను కొనసాగిస్తున్నారు.
ఇప్పటికే భవన నిర్మాణ రంగ కార్మికులు ఇసుక కొరతతో పనులు లేక లబోదిబోమంటున్నారు. జగన్ సీఎం అయ్యాక వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇసుక కొత్త పాలసీని అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఉన్న ఇసుక విధానం రద్దు చేసి కొత్త విధానం ప్రారంభించే లోపు విపరీతమైన ఇసుక సమస్య నెలకొంది. ఇక కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చినా ఇసుక కొరత మాత్రం తీరటం లేదు. దీంతో నిర్మాణ రంగ కార్మికులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.