హైదరాబాద్లో కబ్జా: కోర్టులో లొంగిపోయిన జగన్ మేనమామ రవీంద్రనాథ్
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గురువారం నాడు మియాపూర్ కోర్టులోని 25వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట లొంగిపోయారు.
ఓ భూవివాదానికి సంబంధించి పెండింగులో ఉన్న కేసులో హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. రూ.లక్ష పూచీకత్తు, బెయిల్ పత్రాలను కోర్టుకు అందించారు.
ఈ కేసులో పోలీసులు గత నెల 13న ప్రతాప్ రెడ్డి, నర్సింహ రెడ్డి, రాజిరెడ్డిలని రిమాండుకు తరలించారు. సుధాకర్తో పాటు రవీంద్రనాథ్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన కోర్టులో లొంగిపోయారు.
జగన్ మామపై భూకబ్జా కేసు, అరెస్టు కోసం ప్రత్యేక బృందాలు
కాగా, మెహిదీపట్నంలోని సంతోష్ నగర్కు చెందిన దామరచెరువు ప్రమీలకు మాదాపూర్ ఖానామెట్ పరిధిలో ప్లాట్ ఉంది. ఇది 300 గజాల స్థలం. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో నివాసం ఉంటున్న కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ప్రతాప్ రెడ్డి, నర్సింహా రెడ్డి, హైదరాబాదుకు చెందిన రాజిరెడ్డి, కేపీహెచ్బికి చెందిన రాజిరెడ్డిలు నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను సృష్టించి కబ్జా చేశారు.
రవీంద్రనాథ్ రెడ్డి అప్పట్లో రూ .25 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రమీల దీనిపై ప్రశ్నించగా.. ఆమెను బెదిరించారు. బాధితురాలు 2012 ఏప్రిల్ 7న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగేళ్ల తర్వాత ఇటీవల పోలీసులు కొందర్ని అరెస్టు చేశారు.