పేదల ఇళ్ల స్ధలాల కేటాయింపులో కుల రాజకీయం - రాయదుర్గం తహసీల్దార్ సస్పెన్షన్
ఏపీలో సంక్షేమ పథకాలను కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా వర్తింపచేస్తామని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా అక్కడక్కడా అధికారులు, అధికార పార్టీల నేతల కారణంగా లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. పేదలకు లాటరీ పద్ధతిలో కేటాయించాల్సి ఇళ్లను కులాల ప్రాతిపదికన కేటాయించిన ఆరోపణలతో అనంతపురం జిల్లాలో ఓ తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు పడింది. తద్వారా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్లయింది.
రూల్స్ కంటే కులమే ముఖ్యం..
ఏపీలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఇళ్ల పంపిణీ కోసం స్ధలాలను గుర్తించిన ప్రభుత్వం.. లాటరీ పద్దతిన పేదలకు వాటిని కేటాయించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది.
ఉగాది కంటే ముందే ఈ కసరత్తు పూర్తయినా కరోనా కారణంగా ఇళ్ల స్ధలాల పంపిణీ వాయిదా పడింది. అయితే కసరత్తు పూర్తయిన చోట్ల కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణ జరిపించింది. ఇందులో అనంతపురం జిల్లా రాయదుర్గం తహసీల్దార్ డీవీ సుబ్రహ్మణ్యం తన పరిధిలోని 11 గ్రామాల్లో లాటరీ పద్ధతి పాటించకుండా కులాల ప్రాతిపదికన ఇళ్లు కేటాయించినట్లు తేలింది.
తహసీల్దార్ సస్పెన్షన్..
రాయదుర్గం మండలం పరిధిలోకి వచ్చే 11 గ్రామాల్లో కులాల ప్రాతిపదికన ఇళ్ల కేటాయింపు జరిగిందని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించిన ప్రభుత్వం... ఆరోపణలు నిర్ధారణ కావడంతో తహసీల్దార్ సుబ్రహ్మణ్యంపై సస్పెన్షన్ వేటు వేస్తూ అనంతపురం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వంతో పాటు రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన తహసీల్దార్ పై చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ కొనసాగుతున్నంత కాలం తహసీల్దార్ రాయదర్గం విడిచి వెళ్లరాదని కూడా ప్రభుత్వం ఆదే్శించింది.