రాయల తెలంగాణను ప్రతిపాదించా కానీ: మంత్రి కోట్ల
కర్నూలు/అనంతపురం: రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి తాను మంత్రుల బృందానికి (జివోఎం)కు నాలుగు ప్రతిపాదనలు చేశానని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తువ్వదొడ్డిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
జివోఎంకు ఇచ్చిన ప్రతిపాదనల్లో తొలుత తాను రాష్ట్ర సమైక్యతకే ప్రాధాన్యం ఇచ్చానన్నారు. విభజన అనివార్యమైతే ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ, కర్నూలు రాజధాని అంశాలను వివరించానని చెప్పారు. అలాగే, కర్నూలు జిల్లాలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రణాళికలను రూపొందించినట్టు చెప్పారు.
సీమను చీల్చుతారా: పయ్యావుల
అనంతపురం జిల్లా ఉరవకొండలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విలేకరులతో మాట్లాడుతూ రాయల తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టి ఆమోదం తీసుకుని పార్లమెంటులో తెలంగాణ అని మాట మార్చే ఎత్తుగడలో కేంద్రం ఉన్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం విభజనపై స్పష్టత ఇచ్చిన తర్వాతే ఐక్యకార్యాచరణ సమితి నాయకులతో చర్చించి ముందుకు వెళతామన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం పూటకో మాట మాట్లాడి, స్పష్టత ఇవ్వకుండా సమస్యను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందన్నారు.