సీమ, ఉత్తరాంధ్రల్లో హర్షాతిరేకాలు: జగన్ చిత్రపటానికి పాలాభిషేకాలు: థ్యాంక్యూ సీఎం అంటూ..!
కర్నూలు: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును శాసనసభ ఆమోదించడం పట్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో హర్షతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. చట్టసభల రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా, ఉత్తరాంధ్రలోని విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా బదలాయించడానికి వీలు కల్పించిన ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదించడాన్ని ఆయా జిల్లాల ప్రజలు స్వాగతిస్తున్నారు.
టీడీపీ కొత్త డిమాండ్: ఆర్థిక రాజధానిగా, ఫిల్మ్ ఇండస్ట్రీ క్యాపిటల్గా విశాఖ ఓకే: పరిపాలన మాత్రం నో..
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో ఆ ప్రాంత వాసుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీ ఆమోదం తెలుపడంతో సీమ ప్రజలు సీఎం జగన్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలభిషేకాలు చేస్తున్నారు. కర్నూలును జూడిషియల్ క్యాపిటల్ గా ప్రకటించడంతో కర్నూలు వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద రాయలసీమ అడ్వొకేట్ల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు స్వీట్లను పంచి పెట్టారు. ఇక న్యాయవాదులతో పాటు వివిధ కళాశాల లెక్చరర్లు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ కర్నూలులో బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.
దివంగత ముఖ్యంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద బాణసంచా పేల్చి సంబరాలు చేశారు. ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఇక పులివెందులలోని పూల అంగళ్ల సర్కిల్ లో ఆ పార్టీ నాయకులు టపాసులు పేల్చారు. అనంతపురం జిల్లా హిందూపురం, కదిరి పట్టణాల్లో వైసీపీ నాయకులు విజయోత్సవ ర్యాలీలను నిర్వహించారు. బైక్ ర్యాలీ చేపట్టారు.