రాయలసీమలో రాజధాని .. మూడుప్రాంతాల్లోనూ అసెంబ్లీ : ఎంపీ టీజీ వెంకటేష్ సంచలనం
అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కారాదని, వికేంద్రీకరణ జరగాలని అందుకే ఏపీకి మూడు రాజధానులు అవసరముందని సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం నేటికీ ఏపీలో కొనసాగుతుంది. ఏపీ మూడు రాజధానుల రగడ విషయంలో నెలకొన్న గందరగోళానికి చెక్ పడటం లేదు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్,అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు జగన్ ప్రకటించిన రోజు ఆ నిర్ణయాన్ని స్వాగతించిన బీజేపీ ఎంపీ, రాయలసీమ నేత టీజీ వెంకటేష్ క్రమంగా తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు.
మూడు రాజధానులు తుగ్లక్ చర్య..వైయస్సార్ పైనా: మోదీ జోక్యం చేసుకోవాలి: శేఖర్ గుప్తా సంచలనం..!
వైజాగ్ వాసులు అడగకున్నా రాజధాని అక్కడే ఎందుకు అని ప్రశ్నించిన ఎంపీ
కర్నూలులో హైకోర్టు మాత్రమే కాకుండా అసెంబ్లీ, సచివాలయం కూడా ఉంటే బాగుంటుంది అని తన అభిప్రాయం చెప్పిన ఆయన తాజాగా మరోమారు తన అభిప్రాయం తెలియజేశారు. వైజాగ్ వాసులు రాజధాని కావాలని అడగకుండానే అక్కడ రాజధాని ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకోవటం దారుణం అన్నారు. రాయలసీమ వాసులు ఎప్పటి నుండో అడుగుతున్నా తమకు రాజధాని ఇవ్వకపోవటం అన్యాయం అని పేర్కొన్నారు.
రాజధాని రాయలసీమలో పెట్టాలని డిమాండ్ .. మూడు చోట్ల అసెంబ్లీ పెట్టాలని సూచన
రాయలసీమ ప్రాంతం ఎంతో కాలంగా వెనుకబడి ఉండటం,గతంలో ఏపీ రాజధానిగా కర్నూలు ఉండటం, ఇక రాజధాని రాయలసీమే కావాలని ఆయన తన డిమాండ్ వినిపించారు .రాజధాని కావాలని ఉత్తరాంధ్రా వాసులు ఎప్పుడు అడగలేదనీ చెప్పిన టీజీ వెంకటేష్ రాయలసీమలో రాజధాని ఏర్పాటు చెయ్యాలని లేదంటే మూడు ప్రాంతాల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చెయ్యాలని కొత్త డిమాండ్ తెరమీదకు తెచ్చారు.
సీఎంలు రాయలసీమ వారే అయినా రాయల సీమపై పూర్తిగా నిర్లక్ష్యం అన్న టీజీ వెంకటేష్
రాయలసీమ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమలో సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసి, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరారు. రాయలసీమ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసినందుకు ఆయన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు.ముఖ్యమంత్రులు రాయలసీమ వాసులైనా రాయలసీమకు అన్యాయమే జరుగుతుందని ఆయన ఆరోపించారు. రాజధాని వికేంద్రీకరణ చేస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న అభిప్రాయాన్ని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వ్యక్తం చేశారు.