జగన్ డ్రీమ్-ఏపీ చరిత్రలో అతిపెద్ద లిఫ్ట్ -రాయలసీమ ఎత్తిపోతలపై కీలక పరిణామం- కేసీఆర్ సర్కారు గగ్గోలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కీలక పరిణామాం చోటుచేసుకోనుంది. రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టయిన సీమ ఎత్తిపోతల పనులకు టెండర్ల ప్రక్రియ చేపట్టేలా జగన్ సర్కారు సోమవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
కరోనా టెస్టు భయంతో కారు రాంగ్ టర్న్.. వాగులో గర్భిణి గల్లంతు.. కొద్ది దూరంలో తుంగభద్ర..తీవ్ర ఉత్కంఠ
ఆ ఆరు జిల్లాలకు నీరు..
రూ.3,278 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కుల నుంచి 80వేల క్యూసెక్కులకు పెంచనున్నారు. అదే సమయంలో సీమలోని నాలుగు జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు పుష్కలంగా కృష్ణా జలాలను తరలించే పనులు చేపట్టనున్నారు. తొలి నుంచి ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం మరోసారి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మరోసారి ఫిర్యాదు చేయడంతోపాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించనున్నట్లు తెలిసింది. ఇప్పటిక తెలంగాణ కాంగ్రెస్ నేతలు దీనిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు.
ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్తో..
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఈనెల 20నే టెండర్ నోటిఫికేషన్ రావాల్సి ఉన్నా, తెలంగాణలోని నారాయణపేట జిల్లా బాపనపల్లికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ)కి ఫిర్యాదు చేయడంతో అది తాత్కాలికంగా వాయిదా పడింది. విచారణ అనంతరం.. పనుల టెండర్లు, నోటిఫికేషన్లు జారీ చేసుకోవచ్చంటూ ఎన్జీటీ.. ఏపీ సర్కారుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, తుది తీర్పు వెలువడే దాకా క్షేత్ర స్థాయిలో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదని ఎన్జీటీ చెప్పినప్పటికీ.. జరుగుతోన్న పరిణామాలు ఆశాజనకంగానే ఉన్నట్లు జగన్ సర్కారు భావిస్తున్నది. మరోవైపు సీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులపై పరిశీలన చేయాలంటూ కేంద్రాన్ని సైతం ఎన్జీటీ ఆదేశించింది.
ఏపీ చరిత్రలోనే అతి పెద్ద లిఫ్ట్..
శ్రీశైలం జలాశయానికి అంత్యంత సమీపంలో ఏపీ సరిహద్దు ప్రాంతంలో నిర్మించనున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఈనెల 27న(సోమవారం) టెండర్ల ఆహ్వానానికి నోటీఫికేషన్ జారీ కానుంది. దీనికి సంబంధించి గతంలోనే ఏపీ సర్కారు జీవో 203 విడుదల చేసింది. ఆ జీవోలోని సారాంశం ప్రకకారం.. ఎత్తిపోతల ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించాలని, తద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ.3,278 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో.. నీటిని ఎత్తిపోయడానికి 12 పంపులకు గానూ 396 మెగావాట్ల విద్యుత్ అవసరం. కాబట్టే, దిగువ రాష్ట్రమైన ఏపీలో నిర్మితం కానున్న అతి పెద్ద ఎత్తిపోతల పథకంగా ఇది నిలవనుంది.
కిమ్ జాంగ్ కు మోదీ సర్కార్ భారీ సాయం - కష్టకాలంలో ఉత్తరకొరియాకు ఆపన్నహస్తం - చైనా చైన్ తెగడంతో..
నీటి తరలిపు ప్రణాలిక ఇదీ..
కృష్ణానదిలోకి దాని ఉపనది తుగభద్ర కలిసే స్థలం సంగమేశ్వరం. బ్యాక్ వాటర్ పరిధిలోకి వచ్చే ఆ చోటికి నీళ్లు చేరినప్పుడు.. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 800 అడుగులుగా ఉంటుంది. వరద సమయంలో సంగమేశ్వరం నుంచి ఒక్కో పంపు ద్వారా 2893 క్యూసెక్కుల నీటిని, మొత్తం 12 పంపుల ద్వారా 34,722 క్యూసెక్కుల నీటిని సుమారు 40 మీటర్లు(39.60మీ) ఎత్తిపోసేలా పంప్ హౌజ్ నిర్మిస్తారు. అక్కడి నుంచి మచ్చుమర్రి వరకు 4.5 కీలోమీటర్ల చొప్పున అప్రోచ్ కెనాల్ నిర్మిస్తారు. సంగమేశ్వరం పంప్ హౌజ్ నుంచే 125 మీటర్ల పొడవుండే పైప్ లైన్ ద్వారా నీళ్లను డెలివరీ సిస్టర్న్ లో పోస్తారు. అక్కడి నుంచి 22 కీలోమీటర్ల పొడవైన కాలువలు తొవ్వి, శ్రీశైలం రైట్ కెనాల్ కాల్వలోకి 4వ కి.మీ వరకు తరలిస్తారు. ఆ నీటిని బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్, అక్కణ్నుంచి ఎడమ కాలువ ద్వారా తెలుగు గంగకు, మధ్యలో కాలువల ద్ారా కేసీ కెనాల్ కు, కుడి కలువ ద్వారా ఎస్ఆర్బీసీ, గాలేరుకు నీటిని తరలిస్తారు.
కేసీఆర్ సర్కారు ఇప్పటికే
రాలయసీమ ఎత్తిపోతల పేరుతో జగన్ సర్కారు నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టు పూర్తయితే, భవిష్యత్తులో నాగార్జున సాగర్ ఎడారిగా మారుతుందని, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగు, తాగు నీటికి ఇబ్బందులు ఏర్పడతాయని కేసీఆర్ సర్కారు ఇప్పటికే కృష్ణా నీటియాజమాన్య బోర్డు అపెక్స్ కమిటీకి ఫిర్యాదు చేసింది. అపెక్స్ అనుమతి లేని ప్రాజెక్టును నిర్మించరాదని, డీపీఆర్ లను సమర్పించాలని కృష్ణా బోర్డు ఆదేశించగా, ఇది రాష్ట్ర విభజనకు ముందు నాటి ప్రాజెక్టేనని, మరోసారి డీపీఆర్ లు అడగొద్దని జగన్ సర్కారు ఘాటుగా స్పందించింది. కేసీఆర్ ప్రయత్నాలేవీ జగన్ దూకుడును నిలువరించలేకపోవడం, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు టెండర్లకు సోమవారం నోటిఫికేషన్ కూడా జారీ అవుతుండటంతో మరోసారి బోర్డుతోపాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాలని తెలంగాణ సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం.
Recommended Video
జగన్ను కేంద్రం అడ్డుకుంటుందా?
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానున్నవేళ.. ఏపీ జలదోపిడీకి పాల్పడుతున్నదంటూ ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి శనివారం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖరాశారు. సీమ ఎత్తిపోతలను తక్షణమే నిలిపేసేలా ఆదేశాలు జారీ చేయాలని వంశీ చంద్ తన లేఖలో కోరారు. గతంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు సైతం కేంద్రానికి లేఖలు రాశారు. ఆ సందర్భంలో జలశక్తి మంత్రి షెకావత్ స్పందిస్తూ.. రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ ముందుకు వెళ్లకుండా ఉండేలా స్టే విధిస్తామని కూడా హెచ్చరించారు. అయినాసరే, వెనక్కి తగ్గని జగన్ సర్కారు.. తాను ఒక చుక్క కూడా అదనపు నీటిని వాడుకోబోమని, హక్కుగా లభించే జలాలను మాత్రమే తరలిస్తామని వాదించింది. తాజాగా టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుండటంతో జగన్ ను కేంద్రం అడ్డుకుంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.