చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై భగ్గుమన్న రాయలసీమ వాసులు: శవయాత్ర నిర్వహించిన విద్యార్థులు
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో సూచనప్రాయంగా చేసిన మూడు రాజధానిలో ప్రకటనపై ఇప్పుడు ఏపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమ వాసులు మాత్రం జగన్ ప్రకటనను స్వాగతిస్తూ వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలపై నిప్పులు చెరుగుతున్నారు. శవయాత్రాలు, ఆందోళనలు నిర్వహిస్తూ తమ డిమాండ్ ను గట్టిగా వినిపిస్తున్నారు.
మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా తప్పుబట్టారు. నిపుణుల కమిటీ నివేదిక రాకముందే జగన్ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక రాజధాని నిర్మాణానికే నిధులు లేవు అన్న జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధాని నిర్మాణం ఎలా చేస్తారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.ఇక టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ, రాజధాని వికేంద్రీకరణ కాదంటూపేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తుగ్లక్ నిర్ణయాల్లా ఉన్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ, జనసేనలపై భగ్గుమన్న రాయలసీమ వాసులు
అయితే మూడు రాజధానుల ప్రతిపాదన వ్యతిరేకిస్తున్న టిడిపి,జనసేన పార్టీ లపై భగ్గుమంటున్నారు కర్నూలు జిల్లా వాసులు. గతంలో చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేశాడని, ప్రస్తుతం సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమకు ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారని కర్నూలు వాసులు మాట్లాడుతున్నారు. ఎంతో కాలంగా కర్నూలులో హైకోర్టు కావాలని ఉద్యమాలు చేస్తున్నామన్న కర్నూలు విద్యార్థి సంఘాల నాయకులు, సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనను స్వాగతించారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల శవ యాత్ర
పవన్ కళ్యాణ్,చంద్రబాబు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కర్నూలు జిల్లా వాసులు వారి దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం వారి దిష్టిబొమ్మలను కెనాల్ లో నిమజ్జనం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఎలక్షన్ లో రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బుద్ధి చెప్పారు అయినప్పటికీ ఇంకా వారు చేస్తున్న వ్యాఖ్యలు వారి పతనానికి కారణమని మండిపడుతున్నారు.
చంద్రబాబు, పవన్ ల తీరు దుర్మార్గం అని మండిపాటు
రాయలసీమ ప్రజల పరిస్థితి ముఖ్యమంత్రి అర్థం చేసుకుని జుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని వారంటున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కర్నూలు రాజధానిని వ్యతిరేకించడం దుర్మార్గమైన చర్య అని వారు అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం వారికి కర్నూలు దూరం అని వ్యాఖ్యానించడంపై వారు మండిపడ్డారు. అలా అయితే దేశ రాజధాని ఢిల్లీ దూరంగా లేదా? అక్కడ మీరు వెళ్లి రావడం లేదా అంటూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.
వ్యతిరేకిస్తే సీమలో కాలు పెట్టనీయమని హెచ్చరిక
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనను వ్యతిరేకిస్తే కర్నూలులో కాలుపెట్టనీయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదన రాయలసీమ వాసులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేయాలని మాజీ సీఎం చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. జగన్ ప్రకటనను వ్యతిరేకిస్తున్న చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు నిరసన సెగ బాగానే తగులుతుంది.