రాయలసీమ చరిత్రలో దుర్థినం:‘‘అరవింద సమేత’’పై చర్చ కోసం వస్తున్న యువకులకు ప్రమాదం
Recommended Video
కర్నూలు:త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ''అరవింద సమేత వీరరాఘవ'' సినిమాలో రాయలసీమ నేపథ్యాన్ని అవమానించారంటూ ఆ ప్రాంతవాసులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదే క్రమంలో రాయలసీమకు అవమానంపై పోరాటం చేస్తున్న ఒక యువకుల బృందం ఘోర రోడ్డు ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వీరంతా 30 ఏళ్ల లోపు వారేనని తెలుస్తోంది. పైగా "అరవింద సమేత వీరరాఘవ''లో సీమ నేపథ్యానికి అవమానంపై ఒక టివి ఛానెల్లో జరగనున్న చర్చా కార్యక్రమానికి వీరు హాజరయేందుకు వస్తుండగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
''అరవింద సమేత వీరరాఘవ'' సినిమాలో రాయలసీమ నేపథ్యాన్ని కించపరిచారంటూ సినిమా విడుదల నాటి నుంచి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు,చర్చా కార్యక్రమాలు మొదలైన సంగతి తెలిసిందే. ఇదే కోవలో ఈ సినిమా గురించి ఓ ఛానెల్ డిబేట్లో పాల్గొనడానికి వెళుతున్నరాయలసీమ యువకులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదం గురించి హరినాథ రెడ్డి అప్పిరెడ్డి అనే వ్యక్తి ఫేస్ బుక్ లో వివరాలు ప్రమాదం దృశ్యాలను పోస్ట్ చేశారు. ఆయన తెలిపిన వివరాలు యథాతథంగా మీకోసం...
"వీళ్ళంతా కనీసం ముపైఏళ్ళు కూడా దాటని సీమ యువకులు. నిరంతరం రాయలసీమ సమస్యలపై కార్యక్రమాలలో మమేకం అయ్యే సీమ ముద్దు బిడ్డలు. "అరవింద సమేత వీర రాఘవ" సినిమా విషయమై రాయలసీమ భాష, జీవితాల్ని కించపరచడాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాదు లో నిన్న ప్రెస్ మీట్ ను నిర్వహించారు. నిన్ననే హెచ్.యం టివి లో సీమ ప్రాంతాన్ని సినిమాలలో అవమానించడాన్ని వ్యతిరేకిస్తూ డిబేట్ లో పాల్గొన్నారు.
ఈ రోజు సాయంత్రం టి.వి 9 వారి ఆహ్వానం మేరకు డిబేట్ లో పాల్గొనడానికి రాయలసీమ నుండి హైదరాబాదు బయలు దేరారు. తుంగభద్ర దాటి కొంత ప్రయాణం సాగింది. హఠాత్తుగా హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరి వాహనం నుగ్గయింది. జలం శ్రీను తుదిశ్వాస విడిచారు. శ్రీను బ్రహ్మణకొట్కూరు నివాసి. కర్నూలులో స్థిరపడ్డాడు. బహుజన ఉద్యమంతో పాటు సీమ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు. కన్నీటీతో అయన ఆత్మకు నివాళి అర్పిస్తున్నాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆశయాల సాధనకు మా తుది శ్వాస వరకు పని చేస్తామని తెలియచేస్తున్నాం.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మా గుండెలు దుఃఖాన్ని నింపుతున్న ....... సీమ కృష్ణ నాయక్, (అవుకు మండలం, కర్నూలు జిల్లా, కాగా అనంతపురంలో ప్రస్తుతం ఉంటున్నారు), రవికుమార్ (కర్నూలు), రాజశేఖరరెడ్డి (గుత్తి) తదితర ఉద్యమ మిత్రులు త్వరగా క్షేమంగా కోలుకోవాలని కోరుకొంటున్నాను. మీ కుటుంబాల కోసం, సీమ భవితవ్యం కోసం సీమ సమాజం వేయి కళ్ళతో మీ కోసం ఎదురు చూస్తోంది"...మీ హరినాథ రెడ్డి అప్పిరెడ్డి