ఇందిర కోడలైనా శిక్ష అనుభవించాలి!: సోనియాకు రాయపాటి చురక
గుంటూరు: నేను ఇందిరా గాంధీ కోడలిని అని, తాను ఎవరికీ భయపడనని చెప్పిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు గురువారం నాడు కౌంటర్ ఇచ్చారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ దోషి అని తేలితే చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని రాయపాటి అన్నారు. ఇందిరాగాంధీ కోడలైనా, రాజీవ్ గాంధీ భార్య అయినా చట్టం ముందు ఒకటే అని చురకలు అంటించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనే ప్రత్యేక హోదా అంశాన్ని చట్టబద్ధం చేసి ఉంటే ఇప్పుడు మనకు ఈ ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు ప్రత్యేక హోదా కోరుతున్నందునే కేంద్రం దీనిపై ఆచితూచి వ్యవహరిస్తోందని చెప్పారు.
రాయపాటి తాను దత్తత తీసుకున్న ధర్మవరం గ్రామ అభివృద్ధికి గెయిల్ సంస్థ సాయం అందించింది. రూ.8.95 కోట్లతో గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.2 కోట్ల సాయం అందించింది. గ్రామాన్ని సందర్శించిన గెయిల్ బృందం ఆ తర్వాత రాయపాటితో భేటీ అయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కాగా, రెండు రోజుల క్రితం సోనియా గాంధీ మాట్లాడుతూ... 'నేను ఇందిరా గాంధీ కోడల్ని. నేనెందుకు అప్సెట్ అవుతాను. నేనెవరికీ భయపడన'నని వ్యాఖ్యానించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలకు ఆమె పై విధంగా స్పందించారు. దీనిపై రాయపాటి చురకలు అంటించారు.