మోడీకి ఏపీ ఉసురు: రాయపాటి సంచలనం, బీహార్ ఎన్నికలతో లింక్
గుంటూరు: తెలుగుదేశం పార్టీ నేత రాయపాటి సాంబశివ రావు మంగళవారం నాడు ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక ప్యాకేజీకి లింక్ పెట్టారు.
ప్రధాని మోడీకి ఏపీ ప్రజల శాపం తగిలిందని రాయపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే బీహార్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారన్నారు. రాజధాని అమరావతికి శంకుస్థాపన రోజున ఎన్నో ఆశలతో ఎదురు చూసిన ఏపీ ప్రజలకు మట్టి ఇచ్చి నిరాశ పరిచారన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే బీహార్ ఎన్నికల్లో పట్టిన గతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను ముందుముందు పడుతుందని హెచ్చరించారు. ఏపీ ప్రజల ఏడుపు తగిలే బీహార్లో బిజెపి మట్టి కొట్టుకుపోయిందన్నారు.
బీహారాలీ, కాశ్మీరీలకు లక్షల కోట్లు ప్యాకేజీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ... అమరావతి శంకుస్థాపనకు వచ్చి మాత్రం కేవలం మట్టి ఇచ్చి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.
ట్రెయినీ ఎస్సైల పాసింగ్ ఔట్ పరేడ్లో చంద్రబాబు
శిక్షణ పూర్తి చేసుకున్న 450 మంది ట్రెయినీ ఎస్సైల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. చంద్రబాబు వెంట ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, డిజిపి రాముడు ఉన్నారు. అనంతపురంలో ఈ కార్యక్రమంలో జరిగింది.
అంతకుముందు.. చంద్రబాబు కడప జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. గండికోట రిజర్వాయర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పూడిక తొలగించి బోటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ వదిలి, రోడ్డు మార్గంలో అనంతపురం వెళ్లారు.