రాజకీయాల నుంచి రాయపాటి వైదొలుగుతున్నారా?: మోడీతో భేటీపై ప్రాధాన్యత
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు రాష్ట్ర రాజకీయాలపై అసంతప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఆయన గుంటూరులో మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పూర్తి అనారోగ్యకరంగా ఉన్నాయని వాపోయారు.
ఈ క్రమంలోనే త్వరలో రాజకీయాల నుంచి తాను వైదొలగనున్నట్లు రాయపాటి ప్రకటించినట్లు తెలిసింది. తన నియోజకవర్గంలో దశాబ్దాలు గడుస్తున్నా తాగునీటి సమస్య కూడా తీర్చలేకపోయామని వాపోయారు. తాగునీటి కోసం రూ. 1150కోట్ల ప్రతిపాదనతో ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు.
అయితే, ఆ మేర నిధులు లేవని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అదే నివేదికను పంపిందని చెప్పారు. భారతీయ జనతా పార్టీలో చేరతారా? అనే ప్రశ్నించగా.. అక్కడ చేరిన వారే పనిలేక ఖాళీగా ఉన్నారని, తాను వెళ్లి మాత్రం ఏం చేయగలనని బదులిచ్చినట్లు తెలిసింది.
రాయపాటి వ్యాఖ్యలను చూస్తుంటే ఆయన టిడిపి పార్టీపై కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజకీయాల నుంచే తప్పుకుంటానని రాయపాటి చెబుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.
కాగా, పలువురి వాదన మరోలా వుంది. టిటిడి ఛైర్మన్ పదవి కోసమే రాయపాటి ఈ విధంగా మాట్లాడుతున్నారని పలువురు చెబుతున్నారు. కాగా, ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీని కలిసిన రాయపాటి ఆయనకు శాలువా కప్పి సన్మానించారు.
నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని పలనాడు, వినుకొండ, మాచెర్ల, గురజాల తదితర ప్రాంతాలలోని ఆరు లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు వాటర్ గ్రిడ్ను ఏర్పాటు చేయాలని రాయపాటి సాంబశివరావు ప్రధాని మోడీని కోరారు. రాయపాటి సాంబశివరావు గురువారం ఉదయం పార్లమెంటు ఆవరణలో ప్రధాన మంత్రిని కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు.
ఈ వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు 1150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటూ దీని నిర్మాణం పూర్తి చేస్తే 253 నివాస ప్రాంతాలకు తాగునీరు అందుతుందని సాంబశివరావు ప్రధానికి వివరించారు. పలనాడు తదితర ప్రాంతాల్లో మెజారిటీ ప్రజలు గిరిజనులు, హరిజనులేననీ, వీరు చాలా సంవత్సరాల నుండి తాగు నీటి సౌక ర్యం లేక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆయన మోడీకి వివరించారు.
ఈ ప్రాంతంలోని జలాలు కలుషితమైనందున వాటర్ గ్రిడ్ను ఏర్పాటు చేయవలసి ఉన్నదని ఆయన చెప్పారు. ప్రధాని చెప్పినదంతా సావధానంగా విన్న తరువాత ఈ ప్రాంతం ప్రజలకు తాను చేయగలిగినంత చేస్తానని హామీ ఇచ్చినట్లు సాంబశివరావు తెలిపారు. ప్రజల అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని మోడీ చెప్పారని ఆయన తెలిపారు.