‘హోదా’ లేకుంటే ఇబ్బందులే, వెంకయ్యదే బాధ్యత: ఎంపీ రాయపాటి
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యక హోదా ఇవ్వాల్సిందేనని తెలుగుదేశం సీనియర్ నేత, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర విభజన సమయంలో అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు భారతీయ జనతా పార్టీ నేతలు కూడా.. ఏపీకి ప్రత్యే హోదా విషయంలో ఇచ్చిన హామీలను ఆయన గుర్తు చేశారు. రాజ్యసభ సాక్షిగా నాడు ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్... ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఫ్రకటించారని రాయపాటి చెప్పారు.
ప్రధాని ప్రకటనను స్వాగతించిన బీజేపీ నేతలు, ప్రస్తుత కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారని ఆయన రాయపాటి గుర్తు చేశారు.
పెద్దల సభ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వెంకయ్య, జైట్లీలపై ఉందని రాయపాటి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని కూడా రాయపాటి వ్యాఖ్యానించారు.
కరవు నివారణకు ప్రత్యేక చర్యలు: చినరాజప్ప
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరవు నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం చినరాజప్ప చెప్పారు. అనంతపురం జిల్లాలో తాగునీరు, పశుగ్రాసం కొరత, కరవు పరిస్థితులపై అధికారులతో చినరాజప్ప సమీక్షించారు. ముఖ్యంగా తాగునీటి సరఫరాకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు.
గల్ఫ్ దేశాలకు పంపే ముఠాలపై నిఘా, పోలీసులకు మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక మొదలైన అంశాలపై ఆయన సమీక్షించారు. సమీక్ష కార్యక్రమంలో మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, పలువురు అధికారులు పాల్గొన్నారు.