జగన్ అందుకే రాంగ్ ట్రాక్లో..: రాయపాటి సంచలన ఆరోపణలు
గుంటూరు: ఏపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన ఆరోపణలు చేశారు. రాజధాని మార్పుతో విశాఖపట్నంను కేంద్రంగా చేసుకుని ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతోందని రాయపాటి ఆరోపించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.
అమరావతిలో డబ్బులు రావనే..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ విశాఖలో భూములను నోటిఫై చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే డబ్బులు రావని, అందుకే విశాఖ వెళ్లి అక్కడ భూములు కొనుగోలు చేస్తున్నారని అన్నారు.
అలా చేస్తే విషం తాగాల్సిందే..
వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రులు, నాయకులు, కార్యకర్తలు విశాఖపట్నంలో భారీగా భూములు కొన్నారని రాయపాటి అన్నారు. అక్కడ కూడా రాజధాని తీసేని కర్నూలు వెళితే భూములు కొన్నవారు విషం తాగి చనిపోవాల్సిందేని తీవ్రంగా స్పందించారు.
అందుకే జగన్ రాంగ్ ట్రాక్లో...
సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారులే ఆయనకు తప్పుడు సలహాలు ఇస్తున్నారని అన్నారు. అందుకే జగన్ రాంగ్ ట్రాక్లో పయనిస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై కక్ష్య సాధింపులో భాగంగానే జగన్ రాజధానిని మార్చడానికి ప్రయత్నిస్తున్నారని రాయపాటి ఆరోపించారు.
కొనసాగుతున్న రాజధాని ఆందోళనలు..
ఇది ఇలావుండగా, అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. 18 రోజులుగా తుళ్లూరులో రైతులు, మహిళలు, విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి తమ నిరసనలు తెలుపుతున్నారు. బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదికను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీఎం జగన్ ఏం చెబితే అదే కమిటీలన్నీ తేలుస్తున్నాయని రైతులు వ్యాఖ్యానించారు. రాజధాని అంశంపై ఎటువంటి కమిటీలు అవసరం లేదని, అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటన వచ్చే వరకూ తమ ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. 18 రోజులు గడుస్తున్నప్పటికీ రాజధాని ప్రాంతంలో రైతులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. పోలీసులు రంగప్రవేశంతో పలు సందర్భాల్లో ఉద్రిక్తత పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ రైతులు, భారీ ఎత్తున మహిళలు తమ ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నారు.