చంద్రబాబు తప్పు చేశారు: మోడీ, బాబు, పవన్ మళ్లీ కలుస్తారంటూ రాయపాటి సంచలన వ్యాఖ్యలు
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
చంద్రబాబు తప్పు చేశారు.. మళ్లీ టీడీపీ, బీజేపీ, జనసేన..
ప్రధాని నరేంద్ర మోడీతో విభేదించి చంద్రబాబు నాయుడు పెద్ద తప్పు చేశారని రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. మళ్లీ టీడీపీ, బీజేపీ, జనసేన కలుస్తాయని ఆయన జోస్యం చెప్పారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని మందడం, వెలగపూడి గ్రామాల్లో ఆదోళన చేస్తున్న రైతులను ఆయన సోమవారం కలిశారు.
జగన్.. రాజధానిని పులివెందులలో పెట్టుకోండి..
రైతులకు రాయపాటి తన సంఘీభావాన్ని తెలియజేశారు. రాజధాని ప్రజలెవరూ అధైర్యపడవద్దని.. తమ పోరాటాన్ని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేగాక, శృతి మించుతున్న పోలీసులపై తిరగబడాలని అన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. మూడు రాజధానులకు బదులు.. కావాలంటే పులివెందులలోనే రాజధాని పెట్టుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూచించారు.
జగన్ సర్కారు అలజడి సృష్టిస్తోంది..
ఇది ఇలావుండగా, అమరావతి రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులకు సీపీఐ నేత నారాయణ మద్దతు తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని ముగ్దూం భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతి ఆంధ్రుల హక్కు అని అన్నారు. రాజధాని తరలింపు ప్రకటన నేపథ్యంలో అమరావతి 29 గ్రామాల్లో మిలటరీ పాలన నడుస్తోందని ఆరోపించారు. దేశంలో ఎన్ఆర్సీ తరహాలో ఏపీలో మూడు రాజధానుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం అలజడి సృష్టిస్తోందని అన్నారు.
తామే రాజధాని నిర్మిస్తామంటూ సీపీఐ నారాయణ
రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి రాజధాని నిర్మించలేనని సీఎం జగన్ చెబుతున్నారని.. అయితే, ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే రూ. 4లక్షల కోట్ల బడ్జెట్ అయినా సరిపోదంటూ నారాయణ ఎద్దేవా చేశారు. తల ఒక చోట.. మొండెం ఒక చోట మరో చోట ఉంటే కుదరదని అన్నారు. అమరావతిలో 12.5 వేల ఎకరాల భూమిని అభివృద్ధికి ఇస్తే పైసా ఖర్చు చేయకుండా అద్భుత రాజధానిని నిర్మించవచ్చని నారాయణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి చేతకాకపోతే.. తమకు అప్పగించాలని, తామే రాజధానిని నిర్మించి చూపుతామని నారాయణ అన్నారు.