అప్పుడు చంద్రబాబు ప్రధాని అయ్యే అవకాశం: రాహుల్ గాంధీకి మాజీ కాంగ్రెస్ నేత ఝలక్
గుంటూరు/విజయవాడ: 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎక్కువ లోకసభ స్థానాలు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల నారా చంద్రబాబు నాయుడు ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని ఎంపీ రాయపాటి సాంబశివ రావు సోమవారం వ్యాఖ్యానించారు.
టీడీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే థర్డ్ ఫ్రంట్లో చంద్రబాబు ప్రధాని అయ్యే ఛాన్స్ ఉంటుందని తెలిపారు. గతంలో జేడీఎస్ అధినేత దేవేగౌడ తక్కువ సీట్లతో గెలిచి ప్రధానమంత్రి అయ్యారని గుర్తు చేశారు. తాను వచ్చే లోకసభ ఎన్నికల్లో నరసారావుపేట నుంచి మళ్లీ ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు.
మోడీ మానసిక పరిస్థితి బాగాలేదని తెలుసు: బుద్ధా వెంకన్న, పవన్ కళ్యాణ్పై రాయపాటి
ప్రధాని పదవి ఆశించేవారు
2019లో బీజేపీయేతర పక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలని భావిస్తోంది. వివిధ పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ కాంగ్రెస్తో కలుస్తున్న వారిలో ఎక్కువ మంది ప్రధాని పదవిపై ఆసలు పెట్టుకున్న వారే కావడం గమనార్హం. మమతా బెనర్జీ, మాయావతి, శరద్ పవార్, చంద్రబాబు నాయుడు, స్టాలిన్ ఇలా ఎందరో కలుస్తున్నారు. ఇందులో మమతా, మాయావతి వంటి వారు ప్రధాని పదవిని ఆశించేవారే.
ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీకి చంద్రబాబు ఝలక్
ఈ విషయాన్ని పక్కన పెడితే ఇటీవల తన ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీకి షాకిచ్చారు. 2019లో ప్రధాని అభ్యర్థి ఎవరు అంటే, పక్కనే ఉన్న రాహుల్ గాంధీ అని చెప్పకుండా, అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు రాయపాటి వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీతో కలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు కూడా సమయం, సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తే చంద్రబాబు ప్రధాని అయ్యే ఛాన్స్ ఉందని ఇప్పుడు రాయపాటి సాంబశివ రావు వ్యాఖ్యానించారు. రాయపాటి మాజీ కాంగ్రెస్ నేత కావడం గమనార్హం.
చంద్రబాబు ఏం చెబుతున్నారంటే?
అయితే, చంద్రబాబు మాత్రం తనకు ఏపీని వదిలి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేస్తున్నారు. తాను ప్రధాని కావాలనుకుంటే గతంలోనే అయ్యేవాడినని, తనకు అలాంటి ఆలోచన లేదని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రిగా సేవ చేయడమే తన కోరిక అన్నారు. అదే సమయంలో చంద్రబాబు బీజేపీయేతర పక్షాలను ఏకం చేసేందుకు జాతీయపార్టీ నాయకులను వరుసగా కలుస్తున్నారు.
మమతతో భేటీకి చంద్రబాబు
ఈ నెల 22వ తేదీన ఢిల్లీలో విపక్షాలు భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇందుకోసం చంద్రబాబు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఆహ్వానించేందుకు సోమవారం కోల్కతా బయలుదేరారు. సాయంత్రం ఆమెను కలవనున్నారు. బీజేపీయేతర పార్టీల ఏకీకరణ, జాతీయస్థాయిలో రూపొందించాల్సిన ఉమ్మడి కార్యాచరణపై ఆయన చర్చించనున్నారు. అలాగే 22న ఢిల్లీలో జరిగే భేటీకి మమతను ఆహ్వానిస్తారు. ఇప్పటికే పలువురు నేతలను ఆహ్వానించారు. ఈ నెల 22న కాకుంటే మరో తేదీన అందరూ కలిసే అంశంపై చంద్రబాబు ఆమెతో చర్చించే అవకాశముంది.