వైయస్ జగన్ వచ్చి వెళ్లాకనే హత్య: రాయపాటి బాంబు, హెచ్చరిక
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించి వెళ్లిన తర్వాతనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త హత్యకు గురయ్యారని టిడిపి నేత రాయపాటి అన్నారు.
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించి వెళ్లిన తర్వాతనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త హత్యకు గురయ్యారని టిడిపి నేత, నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివ రావు బుధవారం ఆరోపించారు.
టీడీపీ నేత దారుణ హత్య: రాడ్లు, గొడ్డళ్లతో దాడి చేసిన వైసీపీ వర్గీయులు
వెల్దుర్తి మండలం కండ్లకుంటలో టిడిపి కార్యకర్త పాపిరెడ్డి హత్యను ఖండిస్తున్నట్లు చెప్పారు. వైసిపి దౌర్జన్యాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాయపాటి హెచ్చరించారు.
హత్యా రాజకీయాలు సరికాదు
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి హత్యా రాజకీయాలు ప్రోత్సహించడం సరికాదని రాయపాటి అన్నారు. ఇళాంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
దారుణ హత్య
కాగా, కండ్లకుంట గ్రామంలో టిడిపి కార్యకర్త పాపిరెడ్డి (42)ని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.
గ్రామానికి చెందిన పాపిరెడ్డి టీడీపీ మాచర్ల నియోజకవర్గం బాధ్యులు కొమ్మారెడ్డి చలమారెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. కాగా, వైసిపికి అనుకూలమైన గ్రామంలో పాపిరెడ్డి టీడీపీ కార్యక్రమాలను విస్తృతం చేయడంతో ఆ పార్టీ వర్గాలు సహించలేకపోయాయని అంటున్నారు.
ఇనుపరాడ్లతో దాడి
ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున గ్రామంలోని సత్రం ప్రధాన రహదారిపై దారికాచిన వైసిపి కార్యకర్తలు పాపిరెడ్డిపై ఇనుపరాడ్లు, గొడ్డళ్లతో దాడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీవ్రంగా గాయపడ్డ పాపిరెడ్డిని మాచర్ల ప్రాథమిక వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స చేశారు.
వైసిపిపై ఆరోపణలు
మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మాచర్ల ఎమ్మెల్యే, వైసిపి నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామం కండ్లకుంట గ్రామంలో ఆధిపత్యం కోసం ఈ హత్య చేశారని స్థానిక టీడీపీ నాయకులు ఇప్పటికే ఆరోపించారు.