ఏపీకి ఆర్బీఐ ఊరట: తొలగిన ఆర్ధిక కష్టాలు (ఫోటోలు)
అమరావతి: ఖనాజాలో నిధులు లేక ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక కష్టాలు తాత్కాలికంగా తీరనున్నాయి. మార్కెట్లోని వివిధ ఏజెన్సీల నుంచి రూ. 1500 కోట్ల రుణాలు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతించింది.
దీంతో ఈ మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం భారీ వడ్డీతో తీసుకున్న వంద కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ను తీర్చనుంది. అదే విధంగా వేస్ అండ్ మీన్స్ ద్వారా తీసుకున్న రూ.770 కోట్ల రుణాలను కూడా క్లియర్ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.
మార్కెట్ నుంచి తీసుకున్న రూ.1500 కోట్లలో రూ.870 కోట్ల రుణాలను తీర్చిన తర్వాత అందుబాటులో రూ.600 కోట్ల నిధులు అందుబాటులో ఉంటాయి. సాధారణంగా రాష్ట్రాల్లో అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం మార్కెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సేకరించేందుకు ఆర్బిఐ అనుమతిస్తుంది.
వీటికి వడ్డీ తక్కువ. ఈ రుణాన్ని పది సంవత్సరాల్లో తీర్చాల్సి ఉంటుంది. ఆర్థిక నిర్వహణ, బడ్జెట్ యాజమాన్యం (ఎఫ్ఆర్బిఎం) నిబంధనల కింద మొత్తం జిఎస్డిపి (స్థూల జాతీయోత్పత్తి)లో మూడు శాతం మార్కెట్ రుణాలు తీసుకునే అవకాశాన్ని ఆర్బీఐ కల్పిస్తుంది. ఈ సదుపాయాన్ని ఏపి ప్రభుత్వం ఉపయోగించుకుంది.
ఏపీకి ఆర్బీఐ ఊరట: తొలగిన ఆర్ధిక కష్టాలు
ఇటీవలే 7.98 శాతం వడ్డీకి రూ.1500 కోట్ల రుణాన్ని తెచ్చుకుంది. అదే ఓవర్ డ్రాఫ్ట్కు వెళితే, తీసుకున్న సొమ్మును రెండు వారాల్లో చెల్లించాలి. వడ్డీ కూడా దాదాపు 8.75 శాతాన్ని ఆర్బీఐ వసూలు చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.14,300 కోట్ల వరకు రుణాలను మార్కెట్ ద్వారా తెచ్చుకోవచ్చు.
ఏపీకి ఆర్బీఐ ఊరట: తొలగిన ఆర్ధిక కష్టాలు
ఇప్పటి వరకు రూ.8500 కోట్ల రుణాలను మార్కెట్ నుంచి ఏపీ తెచ్చుకుంది. ఆర్థిక నిర్వహణ, బడ్జెట్ యాజమాన్యం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసిక కాలానికి రూ.3500 కోట్ల రుణాన్ని మార్కెట్ నుంచి తెచ్చుకునే వెసులుబాటుని ఆర్బీఐ కల్పించింది.
ఏపీకి ఆర్బీఐ ఊరట: తొలగిన ఆర్ధిక కష్టాలు
దీని వల్ల ఏడాదికి రూ.14300 కోట్ల రుణాలను తీసుకోవచ్చు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.8500 కోట్ల రుణాలను మార్కెట్నుంచి తీసుకుంది. ఇదే పరిస్థితి కొనసాగితే, మిగిలిన ఆరు నెలల్లో మరో రూ. 8500 కోట్ల రుణాలు అవసరమవుతాయి.
ఏపీకి ఆర్బీఐ ఊరట: తొలగిన ఆర్ధిక కష్టాలు
అందుకే ఎఫ్ఆర్బిఎం కింద నిర్దేశించిన మూడు శాతం సీలింగ్ను పెంచాలని ఏపి ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర విభజన వల్ల చాలా నష్టపోయామని, ఇప్పుడిప్పుడే రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతోందని, ఎఫ్ఆర్బిఎం కింద సీలింగ్ ఎత్తివేయాలని ఏపీ ఆర్థిక శాఖ కేంద్రానికి పదే పదే లేఖలు రాస్తోన్న సంగతి తెలిసిందే.