పరిటాల హత్యపై చినరాజప్ప,బస్సెక్కి చెమట పట్టించారు
అనంతపురం: దివంగత పరిటాల రవీంద్ర రాజకీయంగా ఎదగడాన్ని ఓర్వలేక ప్రత్యర్థులు ఆయనను హతమార్చారని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోమవారం అన్నారు. ఆయన అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురంలో పర్యటించారు.
వెంకటాపురం గ్రామంలోని పరిటాల ఘాట్ను సందర్శించారు. పరిటాల రవీంద్రకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరిటాల హత్య కేసు పైన పునర్ విచారణ పైన మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించారు.
బస్సెక్కిన చినరాజప్ప
ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విజయవాడ నుండి అనంతపురానికి ప్రయివేటు బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పుట్టపర్తిలో సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు శనివారం రాత్రి ఆయన తన కాన్వాయ్లో బయలుదేరారు.
కొంతసేపటి తర్వాత అనంతపురానికి ప్రయాణీకులతో వెళ్తున్న ఓ ప్రయివేటు బస్సును ఆపి అందులో ఎక్కారు. ఉప ముఖ్యమంత్రి బస్సు ఎక్కడంతో ఏం జరిగిందోనని ప్రయాణీకులు కంగారు పడ్డారు. హఠాత్తుగా కారు దిగి బస్సెక్కడంతో పోలీసులకు కూడా ఏమీ అర్థం కాలేదు.
వెంటనే ఆ బస్సు వెనుక ఎస్కార్ట్ వాహనాలు వెళ్లాయి. ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఆగుతారో తెలుసుకోవడానికి పోలీసు అధికారులు బస్సు డ్రైవర్కు పలుమార్లు ఫోన్ చేశారు. డ్రైవర్ అందించిన సమాచారం మేరకు సంబంధిత పోలీసు స్టేషన్ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో ఎస్కార్ట్ విధులు చేపట్టారు.
ఉప ముఖ్యమంత్రిని అనంతపురం నగరంలోకి తీసుకు రావడానికి అనంతపురం జిల్లా కేంద్రంలోని పోలీసులు శింగనమల సమీపంలోని నాయనపల్లి కూడలికి చేరుకున్నారు. మంత్రి అక్కడ బస్సు దిగి, తిరిగి తన కాన్వాయ్లో అనంతపురానికి, అక్కడి నుండి పుట్టపర్తికి చేరుకున్నారు.