ఏపీలో భూముల రీ సర్వే ..మనుషులకు ఆధార్ లా భూములకు భూధార్ !!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే తాను అనుకున్న పనులు చేసుకుంటూ పోతారు .ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకువెళ్తున్న సీఎం జగన్ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా లెక్క చెయ్యకుండా తనదైన శైలిలో పని చేసుకుపోతున్నారు. రాష్ట్రంలో దాదాపు 120 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భూముల సమగ్ర రీ సర్వేకు నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి భూముల రీ సర్వే చెయ్యాలని ఆదేశించటంతో అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి.
భూసర్వేకు సంబంధించిన జీఓ జారీ చేసిన రెవెన్యూ శాఖ కార్యదర్శి
మనుషులకు ఆధార్ ఎలాగో భూములకు కూడా గుర్తింపు ఉండాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం భూధార్ నంబర్ కేటాయించనుంది.రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వేకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపధ్యంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి మంగళవారం భూసర్వేకు సంబంధించిన జీఓ జారీ చేశారు. మనుషులకు ఆధార్ సంఖ్య ఇచ్చిన విశిష్ట గుర్తింపు సంఖ్య ఎలా కేటాయిస్తారో అలాగే ప్రతి ల్యాండ్ బిట్కు భూధార్ నంబరు కేటాయించి అత్యాధునిక కంటిన్యూయస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) టెక్నాలజీతో భూములను రీసర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఆ పని మొదలు పెట్టారు అధికారులు .
పైలట్ ప్రాజెక్ట్ గా జగ్గయ్యపేట..200.15 కోట్లకు ఆమోదం కోసం వినతి
ఈ మేరకు ఈ టెక్నాలజీ ద్వారా మొదటి దశ కింద పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో తొలుత భూముల రీసర్వే చెయ్యనున్నారు. జగ్గయ్యపేట మండలంలోని మొత్తం 25 గ్రామాల పరిధిలోగల 66,761 ఎకరాల భూములను రీసర్వే చేస్తున్నారు . ఇక ఈ ప్రాజెక్టు కోసం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పెట్టిన రూ.200.15 కోట్లకు పరిపాలనామోదం ఇవ్వాలని సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు.దీంతోపాటు రీ సర్వే కోసం అవసరమైన కొన్ని పరికరాల కొనుగోలుకు కూడా అయన అనుమతి కోరారు.
Recommended Video
రీసర్వేకోసం మౌలిక వసతులు కల్పిస్తున్న సర్కార్
ఇక భూముల రీసర్వే ఫేజ్-1, ఫేజ్-2 కోసం 65 బేస్ స్టేషన్లు, కంట్రోల్ సెంటర్ల స్థాయి పెంపు, నిర్వహణ కోసం నిధులు విడుదల చేయాలని కూడా కోరారు. అంతేకాదు 11,158 రోవర్స్ కొనుగోలుకు పరిపాలనామోదం ఇవ్వాలి అని సర్వే డైరెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వేకు సంబంధించిన మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. ఇక సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ అభ్యర్థనలను పరిశీలించిన ప్రభుత్వం అనుమతించింది. సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో, కొలతల్లో ఏమాత్రం లోపం లేనివిధంగా రీసర్వే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అన్నీ సమగ్రంగా ఉండేలా చూడాలని కూడా పేర్కొంది.