జీశాట్ 29 ప్రయోగానికి అంతా రెడీ.. వెంకన్న సన్నిధిలో ఇస్రో ఛైర్మన్ పూజలు.. గజ సహకరించేనా?
తిరుమల : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరో భారీ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్ 3 - డీ2 రాకెట్ ద్వారా జీశాట్ 29 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది ఇస్రో. దీనికి సంబంధించి అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఉపగ్రహాల ప్రయోగానికి ముందు ఇస్రో ఛైర్మన్ తిరుమల వెంకన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
జీశాట్ 29 కౌంట్ డౌన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ కె.శివన్ తిరుమలకు చేరుకున్నారు. మంగళవారం మార్నింగ్ వీఐపీ దర్శన సమయంలో కొందరు ఇస్రో సైంటిస్టులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. జీశాట్ 29 ఉపగ్రహం నమూనా స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని వేడుకున్నారు. అనంతరం ఆశీర్వాచనాలు అందించిన పండితులు.. ఆయనను శేషవస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు.
జీశాట్ 29 లక్ష్యాలేంటి?
సమాచార సాంకేతిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా జీశాట్ 29 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయన్నారు శివన్. ఈ ఉపగ్రహం ద్వారా జమ్మూ కశ్మీర్, నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సేవలు అందుతాయని తెలిపారు.
గత సంవత్సరం ఇస్రో స్పేస్ లోకి పంపిన జీశాట్ 19 ఉపగ్రహం విజయవంతం కావడంతో కమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అదేక్రమంలో ఇప్పుడు జీశాట్ 29 ఉపగ్రహం విజయవంతమైతే మరింత ప్రయోజనం కలగనుంది. 3600 కిలోల బరువున్న ఈ సమాచార ఉపగ్రహం బుధవారం సాయంత్రం నింగిలోకి దూసుకెళ్లనుంది.
బుధవారం సాయంత్రం నింగిలోకి..
జీశాట్ 29 ఉపగ్రహాన్ని గగనతలంలోకి పంపేందుకు అంతా సిద్ధమైంది. మంగళవారం మధ్యాహ్నం 3గంటల 38 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. దాదాపు 25 గంటల 30 నిమిషాల తర్వాత అంటే బుధవారం సాయంత్రం 5 గంటల 8 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. రాకెట్లోని రెండవ ఎల్110 దశ, మూడవ సీ25 క్రయోదశకు ద్రవ ఇంధనం నింపిన తర్వాత లాంచ్ చేయనున్నారు. 3600 కిలోల బరువున్న జీశాట్ 29 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విజయవంతంగా పంపేలా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.
రెడీ టూ లాంచ్
జీఎస్ఎల్వీ మార్క్ 3 - డీ2 ప్రయోగానికి సంబంధించి సోమవారం రాత్రి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జీశాట్ 29 ఉపగ్రహం ప్రయోగానికి అంతా ఓకే అనుకున్న తర్వాత బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పేస్ లోకి విజయవంతంగా పంపేలా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ధృవీకరించారు సైంటిస్టులు.
గజ సహకరించేనా?
గజ తుఫాన్ నేపథ్యంలో జీశాట్ 29 ఉపగ్రహం ప్రయోగించడం అనుకూలంగా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ గజ తుఫాన్ అడ్డంకిగా మారితే ప్రయోగాన్ని వాయిదా వేస్తామన్నారు ఇస్రో ఛైర్మన్. వాతావరణంలో మార్పులు వచ్చే పరిస్థితి ఉంటే దానికనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.
బుధవారం కడలూరు - పాంబన్ మధ్య గజ తుఫాన్ తీరం దాటుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇస్రో తగిన జాగ్రత్తలు చేపడుతుందని తెలిపారు.