సేమ్ సీన్ రిపీట్ : తేల్చుకోవటానికి సిద్దం: మంత్రి పదవి కొత్త కాదు..సోమిరెడ్డి : సీఈసీకి బాబు లేఖ
ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. తుఫాను ప్రభావిత జిల్లాలకు మినహాయింపు ఇవ్వాలని అభ్యర్దించారు. ఇక, మంత్రి సోమిరెడ్డికి మరోసారి అదే పరిస్థితి ఎదురైంది. రాష్ట్రంలో ఉద్యానవన పంటల మీద మంత్రి సమీక్ష ఏర్పాటు చేసారు. అధికారులు హాజరు కాలేదు. అయితే, ఈసారి ఎదురు చూడకుండా ముందుగానే మంత్రి తన సమీక్షను వాయిదా వేసుకున్నారు. తనకు మంత్రి పదవి కొత్త కాదని..ఎన్నికల సంఘంతో తేల్చుకోవానికి సిద్దమని ప్రకటించారు.
నాలుగు జిల్లాలకు మినహాయింపు ఇవ్వండి..
కేంద్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి లేఖ రాసారు. 4 జిల్లాల్లో ఎన్నికల నియమావళి మినహాయింపు ఇవ్వాలని కోరారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వివరించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టేందుకు.. ఎన్నికల నియమావళి నుంచి మినహాయింపు ఇవ్వాలని చంద్రబాబు లేఖలో కోరారు. ఇప్పటికే తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్న ఒడిశాకు ఎన్నికల సంఘం కోడ్ నుండి మినహాయింపు ఇచ్చింది. దీంతో..అక్కడ మఖ్యమంత్రి తుఫాను సహాయక చర్యల పైన సమీక్షలు ప్రారంభించారు. ముందస్తు చర్యలు మొదలు పెట్టారు. దీంతో..ఏపిలోనూ అదే రకంగా మినహాయింపు కోరుతూ సీఎం లేఖ రాసారు.
సోమిరెడ్డికి మరోసారి అదే విధంగా..
మంత్రి సోమిరెడ్డికి మంగళవారం ఎదురైన పరిస్థితి మరోసారి బుధవారం కూడా ఎదురైంది. మంగళవారం వ్యవసాయ శాఖ పైన మంత్రి సమీక్ష ఏర్పాటు చేసారు. అయితే, ఉన్నతాధికారులు ఎవరూ ఈ సమీక్షకు హాజరు కాలేదు. దీంతో.. రెండు గంటల పాటు ఎదురు చూసిన మంత్రి సోమిరెడ్డి చివరకు సమీక్ష రద్దు చేసుకొని వెళ్లిపోయారు. అదే విధంగా బుధవారం ఉద్యానవన శాఖ పైన మంత్రి సమీక్ష ఏర్పాటు చేసారు. అయితే, అధికారులు రావటం లేదని తెలుసుకున్న మంత్రి సమీక్షను రద్దు చేసారు. అసహనానికి గురైన మంత్రి తనకు మంత్రి పదవి కొత్త కాదని.. ఎన్నికల సంఘంతో తేల్చుకోవటానికి సిద్దమని ప్రకటించారు.
అధికారులు ఏం చేయాలో తెలియట్లేదు..
ఏపీలో కరువు..తుఫాను వంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సమీక్ష చేస్తే ఎలా తప్పవుతుందని మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు. సాధారణ పరిపాలనకు ఆటంకం కలిగిస్తారా అని నిలదీసారు. ముఖ్యమంత్రి సమీక్షలు చేయవద్దని చట్టంలో ఎక్కడైనా ఉందా అంటూ అసహనం వ్యక్తం చేఉసారు. తెలంగాణాకో న్యాయం..ఏపీకో న్యాయం అనే విధంగా వ్యవహరించటం సరి కాదన్నారు. కరువు..ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమీక్షలు చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వాలని సూచించారు. ఇక, ఎన్నికల సంఘం..ప్రభుత్వం మధ్య అధికారులు ఎవరి మాట వినాలో..ఏం చేయాలో తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు.