ఇదేం లాజిక్ పరకాల?: వైసీపీ రవికిరణ్పై కేసు పెట్టిందా?, ఇదీ రియాలిటీ!..
ఏపీ రాజకీయాల్లో అధికార-ప్రతిపక్షాల మధ్య 'పొలిటికల్ పంచ్' వివాదం రసవత్తరంగా సాగుతోంది. రవికిరణ్ వైసీపీ డైరెక్షన్లో పనిచేస్తున్నాడని టీడీపీ వాళ్లు..
విజయవాడ: ఏపీ రాజకీయాల్లో అధికార-ప్రతిపక్షాల మధ్య 'పొలిటికల్ పంచ్' వివాదం రసవత్తరంగా సాగుతోంది. రవికిరణ్ వైసీపీ డైరెక్షన్లో పనిచేస్తున్నాడని టీడీపీ వాళ్లు.. భావ ప్రకటనా స్వేచ్చను హరిస్తున్నారని వైసీపీ వాళ్లు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ చర్చ ఇలా ఉండగానే.. ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ కొత్త చర్చకు తావిచ్చే అంశాన్ని లేవనెత్తారు.
మూడేళ్ల క్రితం వైసీపీ వాళ్లే రవికిరణ్పై కేసు పెట్టారు.. ఇదిగో సాక్ష్యాలు!: పరకాల ప్రభాకర్
పరకాల ప్రభాకర్ ఏం చెప్పారు?
నిజానికి మూడేళ్ల క్రితం వైసీపీయే తొలిసారిగా రవికిరణ్పై కేసు పెట్టింది.. కావాలంటే చూడండంటూ కొన్ని ఆధారాలు కూడా మీడియాకు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాలను పరిశీలిస్తే.. వైసీపీ ఫిర్యాదు మేరకు జూలై 31, 2014న రవికిరణ్ పై కేసు నమోదైంది. ప్రస్తుతం టీడీపీ ఆరోపించినట్లుగానే.. అప్పట్లో వైసీపీ కూడా భావ ప్రకటనా స్వేచ్చను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణతో ఆయనపై కేసు పెట్టింది.
లోపలికెళ్తే కదా లాజిక్..
పైన చెప్పిన విషయాలన్ని పరకాల ప్రభాకర్ వైసీపీ నైతికతను విమర్శిస్తూ వెల్లడించినవి. కానీ, ఇక్కడి వరకే చెప్పుకుంటే.. తప్పంతా వైసీపీదే అన్నట్లు కనబడటంలో ఆశ్చర్యమేమి లేదు. అసలైన లాజిక్ లోపలికెళ్తే తప్ప కనబడదు. రవికిరణ్ పై విశాఖ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన వ్యక్తి.. అరకు ఎంపీ కొత్తపల్లి గీత. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి.. పట్టుమని పది రోజులు కూడా గడవకముందే ఆమె టీడీపీలోకి జంప్ అయిన సంగతి జగమెరిగిన సత్యం.
కొత్తపల్లి గీత 'వైసీపీ' కాదు:
విశాఖ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సమయంలో కొత్తపల్లి గీత వైసీపీ పార్టీలో కొనసాగడం లేదు. ఈ లెక్కన ఇదిగో ఆధారాలంటూ పరకాల ప్రభాకర్ వైసీపీని టార్గెట్ చేయడం.. కేవలం ప్రజలను మభ్య పెట్టి, వాస్తవాలకు మసిపూయడమేనన్నది స్పష్టంగా అర్థమవుతోంది.
చిన్న లాజిక్!:
ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేంటంటే!.. అరెస్టయిన రవికిరణ్.. తాను వైసీపీ అభిమానిని అని స్వయంగా ఒప్పుకున్నాడు. అలాంటి వ్యక్తి వైసీపీ మీద ఎందుకు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తాడు. ఏమాత్రం లాజిక్గా ఆలోచించే వ్యక్తికి అయినా ఈ విషయం సులువుగా అర్థమవుతుంది.
అయితే ఎంపీ కొత్తపల్లి గీత వైసీపీ టికెట్ పై గెలిచి, టీడీపీలోకి ఫిరాయించిన సమయంలో.. ఆ ఆవేదనను తట్టుకోలేక, ఆమె నైతికతను విమర్శిస్తూ రవికిరణ్ కార్టూన్లు వేశాడు. దీంతో కొత్తపల్లి ఎంపీ గీత అనుచరులు విశాఖ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించారు.
మభ్యపెట్టేలా!:
ఇప్పుడు పరకాల ప్రభాకర్ ప్రస్తావిస్తున్న అంశాల వెనుక ఇంత పెద్ద తతంగం ఉంది. కానీ ఇవేవి జనాలకు కనిపించవు, కేవలం మా వాదన మాత్రమే జనం నమ్ముతారనే రీతిలో టీడీపీ వ్యవహరించడం వారి భ్రమనే తప్ప మరొకటి కాదనే అభిప్రాయాలు వ్యక్తమువుతున్నాయి.