CRDAలో ఎస్సీ ఎస్టీల అసైన్డ్ భూములను కొట్టేసిన టీడీపీ నేతలు: కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు
అమరావతి: ఓ వైపు అమరావతిలో రాజధాని రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. వారికి ప్రతిపక్ష పార్టీ టీడీపీ వారికి మద్దతుగా నిలుస్తోంది. అయితే భూముల విషయంలో టీడీపీ నేతల భాగోతాలు వెలుగు చూశాయి. పేద దళితులకు గిరిజనులకు ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములను టీడీపీ నేతలు కొందరు రియల్టర్లు మోసం చేసి వారి వశం చేసుకున్న విషయం వెలుగు చూసింది.
ఎస్సీ ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములు
సీఆర్డీఏ పరిధిలో దళితులకు గిరిజనులకు కేటాయించిన అసైన్డ్ భూములకు సంబంధించి 444 ఎకరాలను టీడీపీ నేతలు రియల్టర్లు తమ వశం చేసుకున్నారని కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు వెల్లడించింది. రాజధాని భూములపై జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ చంద్రబాబు హయాంలో కేటాయించిన భూములపై ఒక నివేదికను గతేడాది డిసెంబర్ 27న ప్రభుత్వానికి సమర్పించింది. సాధారణంగా అసైన్డ్ భూములను ప్రభుత్వం ఎక్స్ సర్వీస్మెన్లకు , పేదలకు భూమి లేని వారికి కేటాయిస్తుంది. ఈ భూములను ఇతరులు కొనరాదు వీటిని అమ్మరాదు. ఇక కేబినెట్ సబ్కమిటీ సమర్పించిన నివేదికలో అమరావతిలో 30 మంది రియల్టర్లు, ఇతర టీడీపీ నేతలు 444.66 ఎకరాల అసైన్డ్ భూములను ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారి నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించింది.
భూములు ల్యాండ్ పూలింగ్ కిందకు రావు అని...
ఏపీ అసైన్డ్ భూముల చట్టం 1977 ప్రకారం, అసైన్డ్ భూములను కొనుగోలు కానీ ఇతరులకు బదిలీ కానీ చేయకూడదు. అయితే ఇక్కడ కొందరు ప్రభావితం చేయగల రియల్టర్లు రాజకీయనాయకుల అండ చూసుకుని దళితులకు గిరిజనులకు కేటాయించిన భూమిని అమ్మాల్సిందిగా వారిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది. అసైన్డ్ భూములు కలిగి ఉన్న దళితులు, గిరిజనుల వద్దకు వెళ్లి వారికున్న భూములు ల్యాండ్ పూలింగ్ కింద గుర్తించబడలేదని దీంతో ఎలాంటి లబ్ధి ప్రభుత్వం నుంచి చేకూరదని మోసపూరితమైన మాటలు చెప్పి వారి వద్ద నుంచి బలవంతంగా భూములను కొనుగోలు చేసినట్లు కేబినెట్ సబ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. అంతేకాదు ఈ భూములు కలిగిన వారికి అభివృద్ధి చేసి ఇస్తామన్న ప్లాట్లు కూడా రావని చెప్పినట్లు కేబినెట్ సబ్కమిటీలోని ఓ అధికారి తెలిపారు.
తొలుత అసైన్డ్ భూములను మరచిన చంద్రబాబు సర్కార్
రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కింద భూములు కలిగి ఉన్న వారికి, రైతులకు కొన్ని వరాలు ప్రకటించింది అప్పటి చంద్రబాబు సర్కార్. అయితే అసైన్డ్ భూములు కలిగి ఉన్న దళితులను గిరిజనులను చంద్రబాబు సర్కార్ మరిచిందని నివేదికలో కేబినెట్ సబ్కమిటీ పేర్కొంది. ఈ అంశాన్నే అదనుగా తీసుకున్న రియల్టర్లు, కొందరు టీడీపీ నేతలు ఎస్సీ ఎస్టీలకు చెందిన భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని భయపెట్టినట్లు కేబినెట్ సబ్కమిటీ తెలిపింది. ఆందోళన చెందిన ఎస్సీ ఎస్టీలు తమ భూమిని రియల్టర్లకు, టీడీపీ నేతలకు అమ్మివేశారని కేబినెట్ సబ్కమిటీలోని సభ్యుడు ఒకరు తెలిపారు.
రియల్టర్లు, టీడీపీ నేతల ఒత్తిడితో జీవో జారీ చేసిన బాబు సర్కార్
ఇక అసైన్డ్ భూములు వారికి అమ్మిన తర్వాత ల్యాండ్ పూలింగ్ కింద అసైన్డ్ భూములు కూడా వస్తాయని వారికి కూడా లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన తర్వాత రియల్టర్లు, కొందరు టీడీపీ నేతలు అసైన్డ్ భూములను కూడా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కిందకు చేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇలా చేస్తే ఆ కొన్న ఆ అసైన్డ్ భూములకు ప్రభుత్వం తరుపున రావాల్సిన అన్ని లబ్ధిలు చేకూరడంతో పాటు అభివృద్ధి చేసి ఇచ్చే ప్లాట్లు వస్తాయని భావించారు. వీరి ఒత్తిడితో అప్పటి చంద్రబాబు సర్కార్ 2014 డిసెంబర్ 14న అసైన్డ్ భూములు ల్యాండ్ పూలింగ్ స్కామ్ కిందకు వస్తాయంటూ జీవో విడుదల చేశారు.
భూముల కొనుగోలులో చట్టాన్ని ఉల్లంఘించిన నేతలు
ఇదిలా ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారి సొంత పేరుతో భూములు కొనుగోలు చేయగా టీడీపీ నేతలు మాత్రం బినామీ పేరుతో భూములు కొనుగోలు చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఇందులోను కొన్ని అవకతవకలను కేబినెట్ సబ్ కమిటీ గుర్తించింది. తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలో ల్యాండ్ పూలింగ్ కింద మొత్తం 54.49 ఎకరాలను ప్రభుత్వం సేకరించగా అందులో 42.92 ఎకరాలు ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ చట్టంను ఉల్లంఘించేలా ఉన్నాయని , 11.57 ఎకరాలు అసైన్డ్ భూములను ఆక్రమించారని కేబినెట్ సబ్కమిటీ వెల్లడించింది.