తమ్మినేని నోటి వెంట జగన్ మనసులో మాట ? తాను బయట పడలేక స్పీకర్ తో చెప్పించారా.. !
ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతున్న తీర్పులపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అయితే ప్రభుత్వమే స్పీకర్ తో ఈ వ్యాఖ్యలు చేయించిందా అన్న చర్చ జరుగుతోంది.
స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యల దుమారం ... దారుణం, క్షమాపణ చెప్పాలని స్పీకర్ ను టార్గెట్ చేసిన టీడీపీ
కోర్టులపై స్పీకర్ ఆగ్రహం...
ఏపీలో వరుసగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతున్న కోర్టు తీర్పులపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా చిత్తూరు పర్యటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల్లో కోర్టుల జోక్యం సరికాదని, కోర్టులే అన్నీ చెప్పేస్తే ఇక ఎన్నికలు, ఎమ్మెల్యేలు ఎందుకంటూ ఆయన ప్రశ్నించారు. దీంతో స్పీకర్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. విపక్ష టీడీపీ, సీపీఐతో పాటు పలు పార్టీలు, నేతలు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సాధారణ జనంలోనూ స్పీకర్ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. రెండు వేర్వేరు రాజ్యాంగ వ్యవస్ధల మధ్య ఈ పోరుకు అసలు కారణాలేంటన్న చర్చ కూడా సాగుతోంది.
కోర్టు తీర్పులపై వైసీపీ...
గతేడాది రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి పలు సందర్భాల్లో న్యాయస్ధానాల్లో ప్రభుత్వానికి చుక్కెదురవుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను కోర్టులు నిర్దాక్షిణ్యంగా కొట్టేస్తున్నాయి. ప్రభుత్వంపై పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు కూడా చేస్తున్నాయి. దీనిపై వైసీపీ శ్రేణులతో పాటు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న వారి నుంచి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో స్ధానిక ఎన్నికల వాయిదా విషయంలో ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరుపై సీఎం జగన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా కోర్టు తీర్పులపై వైసీపీతో సన్నిహితంగా ఉంటున్న చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.
Recommended Video
జగన్ మనసులో మాటే చెప్పారా ?
గతంలో రాజధాని అంశంతో పాటు పలు సందర్భాల్లో జగన్ మనసులో మాటను స్పీకర్ తమ్మినేని వ్యక్తపరిచారు. ఓ రకంగా చూస్తే ప్రభుత్వ వాదనను జనంలోకి తీసుకెళ్లడంలో స్పీకర్ కూడా వైసీపీ నేతలతో పోటీపడుతున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయనే చర్చ సాగుతోంది. అంతిమంగా ఇది సీఎం జగన్ ఉద్దేశమే అన్నట్లుగా మారుతోంది. ఇలాంటి సమయంలో స్పీకర్ తమ్మినేని కూడా జగన్ అభిప్రాయం మేరకే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారా అన్న వాదన వినిపిస్తోంది. అయితే స్పీకర్ గా ఉంటూ రాజ్యాంగ వ్యవస్దలో భాగమైన కోర్టులను బహిరంగంగా తప్పుబట్టడం సరికాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.