చంద్రబాబు కుటుంబం సంక్రాంతి సంబరాలకు దూరంగా ఉండటానికి కారణం ఇదే : విజయసాయి రెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ జరుపుకోమని చెప్పిన విషయం తెలిసిందే. అంతే కాదు సంక్రాంతి నాడు రాజధాని రైతులకు బాసటగా రాజధాని గ్రామాల్లో పర్యటించి అక్కడ వారి నిరసన దీక్షలో పాల్గొన్న చంద్రబాబు ఈ సంకర్న్తి విషాద సంక్రాంతి అని పేర్కొన్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు సంక్రాంతి వేడుకలకు ఎందుకు దూరంగా ఉన్నారో తెలుసా అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్స్ చేశారు .
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఊహించిన లాభాలు రావడం లేదనే పండుగ చేసుకోని బాబు
సంక్రాంతి పండుగను జరుపుకోకుండా చంద్రబాబు కుటుంబం అమరావతి రైతుల దీక్షకు మద్దతు తెలిపిన నేపధ్యంలో విజయసాయి రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
పొరుగు రాష్ట్రాల్లోని తెలుగువారంతా సొంత గ్రామాలకు వచ్చి సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకున్నారని పేర్కొన్న విజయసాయిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఊహించిన లాభాలు రావడం కష్టమని చంద్రబాబు నాయుడి కుటుంబం మాత్రమే సంబరాలకు దూరంగా ఉండి పోయింది.
8 నెలల్లోనే ఇంత పతనమయ్యావేమి బాబూ అన్న విజయసాయి
మిగతా రాష్ట్రమంతా సంతోషంగా పండుగ జరుపుకుంది అని వ్యాఖానించారు. ఇక పచ్చ మీడియా తప్ప బాబు పిలుపును ఎవరూ పట్టించుకోలేదు అని విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు.
అంతే కాదు మరో ట్వీట్ లో ఇప్పటి దాకా దోచుకున్నది చాలదా చంద్రబాబూ? భూముల ధరల స్పెక్యులేటివ్ బూమ్ ను నిజం చేసుకోవడానికి ఇన్ని డ్రామాలు అవసరమా? రాజధాని వికేంద్రీకరణ వద్దని చెప్పడానికి జోలె పట్టుకుని వసూళ్ల యాత్రలు అవసరమా? 8 నెలల్లోనే ఇంత పతనమయ్యావేమి బాబూ? అని విజయసాయిరెడ్డి చంద్రబాబు టార్గెట్ గా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సేకరించిన విరాళాలు కూడా పంచుకుంటారంటూ ఎద్దేవా
ఇక మొన్నటికి మొన్న చంద్రబాబు జోలెపట్టి అమరావతి కోసం విరాళాలు సేకరించటంపై నిప్పులు చెరిగిన విజయసాయిరెడ్డి సేకరించిన విరాళాలు కూడా పంచుకుంటారంటూ ఎద్దేవా చేశారు. అమరావతిని ఎలా మారుస్తారని పళ్లు కొరికారు. ప్రభుత్వం కూలిపోతుందని శాపాలు పెట్టారు. ఉత్తుత్తి ఉద్యమాన్ని ప్రారంభించారు. బంగారు నగల సేకరణకు దిగారు. తర్వాత జోలెతో ఊరూరూ తిరుగుతున్నారు. ఆఖరున వచ్చిన డబ్బును పంచుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లి పోతారు అంటూ ఆయన తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
పండుగకు దూరంగా చంద్రబాబు కుటుంబం .. అందుకే విజయ సాయి సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరి, తన కోడలు, మాజీ మంత్రి లోకేశ్ భార్య బ్రాహ్మణితో కలిసి రాజధాని గ్రామాల రైతుల ఆందోళనల్లో పాల్గొన్నారు . తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో ధర్నా చేస్తున్న రైతులు, మహిళలతో కలిసి సంక్రాంతి నాడు నిరసనల్లో పాల్గొంటారు. పండుగకు దూరంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న రైతులకు చంద్రబాబు కుటుంబం సంఘీభావం తెలిపింది. ఇక ఈ నేపధ్యంలోనే విజయసాయిరెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.