అసలు కారణం అదేనా?: దాస్తున్నారనే.. సుబ్బారెడ్డితో అఖిలప్రియ వివాదం వెనక!
చాలావరకు తమకుటుంబ ఆస్తుల సమాచారాన్ని ఆయన దాచేస్తున్నారని ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నట్లు చెబుతున్నారు.
నంద్యాల: తండ్రికి ఆప్త మిత్రుడైన వ్యక్తి.. కూతురికి మాత్రం ఎందుకు శత్రువుగా మారిపోయాడన్నది నంద్యాల రాజకీయాల్లో ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. భూమా ఉన్నంతవరకు ఆయన ఆత్మలా అన్నింట్లోను చొరవ తీసుకున్న ఏవీ సుబ్బారెడ్డి.. రాజకీయం అఖిలప్రియ చేతిలోకి వెళ్లాక మాత్రం భూమా కుటుంబానికి దూరం జరిగారు.
అటు శిల్పామోహన్ రెడ్డి పార్టీని వీడటం.. ఇటు ఏవీ సుబ్బారెడ్డితో వివాదాలు అఖిలప్రియను ఇరకాటంలో పడేశాయి. ఎన్నికలవేళ ఏంటీ వైఖరి అంటూ అధిష్టానం సైతం ఆమెను సున్నితంగా మందలించింది. అందరిని కలుపుకుపోవాలని సూచించింది. అయినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు.
నంద్యాల ఉపఎన్నిక కోసం పార్టీ చేస్తున్న ప్రచార కార్యక్రమాల్లోను.. భూమా, ఏవీ సుబ్బారెడ్డి అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఒకరు పాల్గొన్న కార్యక్రమానికి మరొకరు దూరంగా ఉంటున్నారు. భూమా మరణం తర్వాత హఠాత్తుగా పరిస్థితి ఎందుకిలా తలకిందులైంది. భూమా కుటుంబంతో ఆయనకు ఇంత అగాథం ఎందుకు ఏర్పడింది? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
అయితే దీనికి అసలు కారణం.. ఆస్తుల గొడవలేనన్నది తాజాగా తెర పైకి వచ్చిన ప్రచారం. భూమాతో ఏళ్లుగా ఉన్న సాన్నిహిత్యం రీత్యా.. ఆయనకు సంబంధించి ప్రతీ పైసా సుబ్బారెడ్డికి తెలుసుని చెబుతారు. అయితే భూమా మరణం తర్వాత తమ ఆస్తిపై సుబ్బారెడ్డి కన్నేశారని అఖిలప్రియ భావించినట్లుగా తెలుస్తోంది. ఆ కారణంతోనే ఆయన్ను అఖిలప్రియ దూరం పెట్టినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
భూమా మరణం తర్వాత ఆస్తులకు సంబంధించిన సమాచారం విషయంలోను సుబ్బారెడ్డిపై అఖిలప్రియ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. చాలావరకు సమాచారాన్ని ఆయన దాచేస్తున్నారని ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు, అటు సీఎం చంద్రబాబు కూడా తన కన్నా సుబ్బారెడ్డికే ప్రాధాన్యం ఇవ్వడం కూడా అఖిలప్రియకు మింగుడుపడటం లేదట. అందుకే భూమా కుటుంబంతో సుబ్బారెడ్డికి ఎడం ఏర్పడిందని చెబుతున్నారు.