ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతోందా ? కేసుల క్షీణత వెనుక ?
ఏపీలో గత కొన్ని రోజులుగా కరోనా పరిస్ధితిని నిశితంగా గమనిస్తే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే 2230 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా ఇందులో దాదాపు 65 శాతం చికిత్స పూర్తి చేసుకుని ఇంటికెళ్లిపోయారు. మిగిలిన వారితో పాటు కొత్తగా నమోదవుతున్న కేసులకు మాత్రమే ప్రస్తుతం చికిత్స కొనసాగుతున్నట్లు ప్రభుత్వెం చెబుతోంది. కానీ క్షేత్రస్ధాయిలో పరిస్ధితి గమనిస్తే భిన్నంగా ఉంది.
కరోనా టైమ్: ఏపీలో వచ్చేనెల మరో సంక్షేమ పథకం: ఇక వారి ఖాతాల్లోకి రూ.10 వేలు: బీసీ ఓటుబ్యాంకు
కరోనా కేసుల్లో క్షీణత...
ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తాజాగా గమనిస్తే మునుపెన్నడూ లేని విధంగా క్షీణిస్తోంది. ఇప్పటివరకూ మొత్తం 2230 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో ప్రస్తుతం 747 మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి. అంటే కేవలం 34 శాతం మాత్రమే ఇంకా బాధితులుగా ఉన్నారు. మిగిలిన 66 శాతం మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన తాజా బులిటెన్ లోనూ గత 24 గంటల్లో కేవలం 25 కేసులు మాత్రమే కొత్తగా నమోదైనట్లు పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి దాదాపుగా తగ్గిపోయిందన్నమాట.
వాస్తవ పరిస్ధితి ఏంటి ?
కానీ రాష్ట్రంలో వాస్తవ పరిస్ధితిని గమనిస్తే ఏపీ వ్యాప్తంగా అనుమానిత కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన వారితో పాటు కొత్తగా అనుమానితులు పెరుగుతున్నారు. అయితే వీరందరికీ కచ్చితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారా అంటే లేదనే సమాధానమే వస్తోంది. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య క్రమంగా తగ్గడానికి ఇదో కారణంగా తెలుస్తోంది. వీరితో పాటు ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఉన్న వారికి కూడా పది రోజుల చికిత్స తర్వాత ఎలాంటి టెస్టులు నిర్వహించకుండానే ఇళ్లకు పంపే పరిస్దితి. ఐసీఎంఆర్ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలే ఇందుకు కారణం. ఈ విధంగా కూడా వైరస్ లక్షణాలు బయటపడకుండా పోతున్నాయి.
Recommended Video
టెస్టింగ్ కిట్లు, మాస్కుల కొరత..
కరోనా వైరస్ ఆరంభ దశలో ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు ప్రతీ ఒక్కరికీ టెస్టులు నిర్వహించేస్తాం అన్నంత హడావిడి చేసింది. మెడ్ టెక్ జోన్ కిట్లతో పాటు కొరియా నుంచి తెప్పించిన కిట్లతో దేశంలోనే అత్యంత ఎక్కువగా టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పుకుంది. కానీ తాజాగా ఆ పరిస్ధితి మారుతోందని అర్దమవుతోంది. ఒక్క విజయవాడనే ఉదారహణగా తీసుకుంటే అనుమానితుల నుంచి సేకరించిన రక్తం నమూనాలను పరీక్షించేందుకు వారం రోజులకు పైగానే సమయం పడుతోంది. కిట్లు పరిమితంగా ఉండటంతో తీవ్ర లక్షణాలతో వచ్చే వారినే పరీక్షిస్తున్నారు. మరోవైపు మాస్కుల కొరత కారణంగా రోగులను పట్టించుకునే వారే కరవవుతున్నారు. దీంతో ఇక ఏపీలో కరోనా అనేది ఓ సాధారణ రోగంగా మారిపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.