ఏపీ కరోనా బులిటెన్ లో జిల్లాల వారీ లెక్కలు మాయం - అసలు రీజన్ ఇదే...
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి ప్రభుత్వం రోజువారీ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తోంది. ఇందులో ప్రతీ జిల్లాలో నమోదైన కేసులు, చికిత్స తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు, మృతుల సమాచారాన్ని పొందుపరుస్తోంది. దీని ద్వారా రోజూ నమోదవుతున్న కొత్త కేసులతో పాటు యాక్టివ్ కేసులు, మృతుల సమాచారం ప్రజలకు చేరుకోంది. వాస్తవ పరిస్దితి కూడా అర్ధమవుతోంది. కానీ కొన్నిరోజులుగా ప్రభుత్వం బులిటెన్ లో పలు మార్పులు చేస్తూ వస్తోంది. దీంతో అసలు పరిస్ధితిని దాచేస్తున్నారన్న విపక్షాల ఆరోపణలకు బలం చేకూరేలా ఉంది.
ప్రభుత్వం గత మూడు రోజులుగా విడుదల చేసిన బులిటెన్లలో ఎక్కడా జిల్లాల సమాచారం కానీ, టెస్టులు ఎన్ని నిర్వహించారనే సమాచారం కానీ లేవు. గత 24 గంటల్లో ఎంత మంది కొత్తగా కరోనా బారిన పడ్డారో మాత్రమే అధికారులు ఇందులో చూపుతున్నారు. మిగతా వివరాలు లేకపోవడంపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. సాధారణ ప్రజల్లోనూ దీనిపై విస్తృతంగా చర్చ సాగుతోంది.
Recommended Video
రోజువారీ కరోనా హెల్త్ బులిటెన్లలో ప్రభుత్వం జిల్లాల వారీ సమాచారం ఇవ్వకపోవడంపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. జిల్లాల వారీ సమాచారం ఇవ్వడం వల్ల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ విషయాన్ని సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో జగన్ జిల్లాల సమాచారాన్ని విడుదల చేయొద్దని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.