ఏపీలో యథావిథిగా మున్సిపోల్స్- ఆగిన చోట నుంచే- జగన్ సర్కార్ నిర్ణయం వెనుక?
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఎన్నికలను గతంలో ఆగిన చోట నుంచే తిరిగి నిర్వహిస్తామని ఇప్పటికే ఎస్ఈసీ ప్రకటించగా.. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. గతంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణ కోసం ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో వారు ఏర్పాట్లు మొదలుపెట్టేశారు. అయితే ఆగిన చోట నుంచే ఎన్నికలు నిర్వహించాలా వద్దా అన్న పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉండగానే ప్రభుత్వం ఈ ఆధేశాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
మున్సిపల్ పోరు యథాతథం
ఏపీలో మున్సిపల్ ఎన్నికలను ఆగిన చోట నుంచి తిరిగి ప్రారంభించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ పూర్తయి తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ తరుణంలో ప్రభుత్వం అధికారులను ఎన్నికల ప్రక్రియను ఆగిన చోట నుంచే ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చేసింది. పురపాలకశాఖ అధికారులు పోలింగ్ సామాగ్రి, నామినేషన్ పత్రాలను స్టోర్ రూమ్ల నుంచి బయటికి తీయాలని ఆదేశాలు పంపారు. దీంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పునఃప్రారంభం అయినట్లే భావిస్తున్నారు.
మార్చి 2 నుంచి నామినేషన్ల ఉపసంహరణ
గతంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మార్చి 2న ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా దానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో మార్చి 2తో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభించేందుకు ఎలా్ంటి ఆటంకాలు లేకపోవచ్చని తెలుస్తోంది. ఆ లోపు హైకోర్టు ప్రత్యేకంగా ఏదైనా ఆదేశం ఇస్తే తప్ప మున్సిపల్ పోరు ఇప్పటికే ఎస్ఈసీ ప్రకటించిన విధంగా జరిగిపోవడం తథ్యంగా కనిపిస్తోంది. ఈ లెక్కన మార్చి 2న నామినేషన్ల ఉపసంహరణతో ప్రారంభమయ్యే ప్రక్రియ మార్చి 10న ఎన్నికలు, 14న కౌంటింగ్తో ముగియనుంది.
జగన్ సర్కార్ తాజా ఆదేశాల వెనుక
మున్సిపల్ ఎన్నికలు ఆగిన చోట నుంచి తిరిగి ప్రారంబించే విషయంలో ఇప్పుడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కు, ప్రభుత్వానికీ మధ్య ఏకాభిప్రాయం కనిపిస్తోంది. అయితే హైకోర్టులో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఆదేశాలు కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ రెండు రోజుల క్రితమే ముగిసినా హైకోర్టు తీర్పు మాత్రం ఇంకా రిజర్వులోనే ఉంది. ఆ లోపు కొత్త పిటిషన్లు కూడా దాఖలవుతున్నాయి.
తాజాగా తాడిపత్రిలో మున్సిపల్ పోరులో నామినేషన్కు అవకాశం ఇవ్వాలని కోరుతూ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి మరికొందరితో కలిసి హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే వీరి విజ్ఞప్తుల్ని హైకోర్టు అంగీకరించపోవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే ఎన్నికల పునఃప్రారంభానికి ఆదేశాలు ఇచ్చేసింది.
అందరి దృష్టీ సోమవారం హైకోర్టు తీర్పుపైనే
మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన కొన్ని పిటిషన్ల విచారణ ఇప్పటికే పూర్తి చేసి తీర్పు రిజర్వులో పెట్టిన హైకోర్టు.. ఆ తర్వాత దాఖలైన పిటిషన్ల విచారణను మాత్రం సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు ఇప్పటికే రిజర్వు చేసిన తీర్పును ఆ పిటిషన్ల విచారణ కూడా పూర్తి చేశాక ఒకేసారి ఇస్తుందా లేక, విడిగా ప్రకటిస్తుందా అన్నది కూడా తేలాల్సి ఉంది.
అయితే ఇప్పటికే కాలాతీతం కావడం, మున్సిపల్ పోరు త్వరగా పూర్తి కావాలని ప్రభుత్వం, ఎస్ఈసీ కూడా ప్రయత్నిస్తున్న తరుణంలో హైకోర్టు ఈ పిటిషన్లలో పిటిషనర్లు కోరిన విధంగా ఎన్నికలను రీనోటిఫై చేసే అవకాశాలు లేవని ప్రభుత్వం, ఎస్ఈసీ కూడా అంచనా వేస్తున్నాయి. అయినా చివరి నిమిషంలో హైకోర్టు అనూహ్య నిర్ణయం తీసుకుంటే మాత్రం టెన్షన్ తప్పదు. అందుకే సోమవారం హైకోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారింది.