ఇరుక్కున్న చంద్రబాబు.. ఆ పర్యటన రద్దుకు కారణమిదే..?
ఏపీలో రాజకీయమంతా ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు 'రాజధానులు' ప్రకటన చుట్టే తిరుగుతోంది. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అని అక్కడి రైతులు, మూడు రాజధానులతోనే సమగ్రాభివృద్ది సాధ్యమని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.
ప్రతిపక్ష టీడీపీ అమరావతిలోనే రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే అదే టీడీపీలో గంటా లాంటి కీలక నేతలు పార్టీ స్టాండ్తో విబేధించడం అధినేత చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. తాజాగా ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు మరో అడుగు ముందుకేసి విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కు అనుకూలంగా తీర్మానం చేయడం ఆయన్ను మరింత ఇరుకునపెట్టే అంశం.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు వచ్చే జనవరి 2,3 తేదీల్లో జరగాల్సి ఉన్న విజయనగరం పర్యటనను రద్దు చేసుకున్నారన్న చర్చ జరుగుతోంది. విశాఖలో రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తున్నందువల్ల సొంత పార్టీ నేతలే తనతో విబేధిస్తున్న తరుణంలో.. విజయనగరంలో పర్యటించకపోవడమే ఉత్తమం అని ఆయన భావించినట్టు తెలుస్తోంది.
పైగా తన పర్యటనలో ఉత్తరాంధ్ర ప్రజల నుంచి బహిరంగ వ్యతిరేకత వ్యక్తమైతే అది పార్టీని మరింత డ్యామేజ్ చేస్తుందన్న ఆలోచనతోనే పర్యటనను రద్దు చేసుకున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద జగన్ తెర పైకి తెచ్చిన మూడు రాజధానుల అంశం చంద్రబాబుకు సొంత పార్టీ నేతలతోనే ఫిటింగ్ పెట్టించిందన్న చర్చ జరుగుతోంది.