18 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు? డుమ్మాలపై సీఎం సీరియస్? ఓటింగ్కు రాకపోడానికి కారణాలేంటి?
మండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో ఓటింగ్ కు దూరంగా ఉన్న 18 మంది వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది. ఆ 18 మందీ రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నారని, సీఎం జగన్ మూడు రాజధానుల విధానంపై నిరసనగానే ఓటింగ్ లో పాల్గొనలేదని టీడీపీ ఆరోపించింది. ఎమ్మెల్యేల గైర్హాజరుపై జగన్ కూడా సీరియస్ అయ్యారని, వాళ్లపై చర్యలకు ఆదేశించే అవకాశాలున్నాయనీ వార్తలు వచ్చాయి. అసలా ఎమ్మెల్యేలు సభకు ఎందుకు రాలేదు? టీడీపీ విమర్శలపై వారి స్పందనేంటి?
సభలో ఏం జరిగిందంటే..
టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంతో మండలి రద్దు తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లయింది. అధికార పార్టీకి మొత్తం 151 మంది ఎమ్మెల్యేలుండగా మండలి రద్దుకు అనుకూలంగా 132 మాత్రమే ఓటేశారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. స్పీకర్ ఓటింగ్ లో పాల్గొనలేదు. మొత్తంగా 18 మంది సభకు డుమ్మాకొట్టారు.
ప్రభుత్వ విప్ వివరణ ఇది..
మండలి రద్దుపై అసెంబ్లీలో ఓటింగ్ లో ప్రభుత్వ విప్ లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాడిశెట్టి రాజా కూడా పాల్గొనకపోవడంపై టీడీపీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై రాజా మంగళవారం మీడియాముందుకొచ్చి వివరణ ఇచ్చారు. ‘‘చంద్రబాబు నక్క అయితే.. యనమల గుంట నక్క. మండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో నేను మాట్లాడినప్పుడు వీళ్ల కళ్లు మూసుకుపోయాయా? తీవ్ర అనారోగ్యం కారణంగా బయటికొచ్చేయడంతో ఓటింగ్ మిస్ అయ్యాను. ఇంతమాత్రానికే టీడీపీ పెద్దలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు''అని తెలిపారు.
హెల్త్ ఎమర్జెన్సీ..
ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓటింగ్ కు కొద్ది నిమిషాల ముందే సభ నుంచి బయటికెళ్లారు. తన సోదరుడి హెల్త్ ఎమర్జెన్సీ కారణంగానే ఆయన అసెంబ్లీ నుంచి వెళ్లినట్లు తెలిసింది. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ప్రొద్టుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద రెడ్డి కూడా ఆరోగ్య కారణాల వల్లే సభకు రాలేదని సమాచారం. తల్లి చనిపోవడంతో సత్యవేడు శాసనసభ్యుడు ఆదిమూలం ఇంటికే పరిమితమైపోయారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పర్సనల్ పనుల వల్ల రాలేకపోయారట.
తలుపులు మూసేయడంతో..
మండలి రద్దుపై ఓటింగ్ సందర్భంగా తలుపులు మూసేయడంతో బయటే ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అవకాశం కోల్పోయారు. వారిలో యూవీ రమణమూర్తి రాజు ( యలమంచిలి), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ( ఉదయగిరి), పర్వత పూర్ణ చంద్రప్రసాద్ (ప్రత్తిపాడు), గ్రంధి శ్రీనివాస్ (భీమవరం), మేకా ప్రతాప్ అప్పారావు(నూజివీడు) ఉన్నట్లు తెలిసింది.
Recommended Video
వేర్వేరు కారణాలు..
అధికార పార్టీ సభ్యులను సభకు రప్పించడం, ఓటింగ్ లాంటి కీలక సమయాల్లో మరింత సంయమనం ప్రదర్శించడం విప్ ల బాధ్యత. అలాంటిది విప్ లే అసెంబ్లీరి రాకపోవడం చర్చనీయాంశమైంది. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా తమ గైర్హాజరుకు వేర్వేరు కారణాలు చెప్పినట్లు తెలిసింది. బిల్లు ఈజీగా, ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో ప్రస్తుతానికి డుమ్మా ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలుండే అవకాశంలేదని వైసీపీ వర్గాలు తెలిపాయి.